సీతామాత అపహరణను హథ్రాస్ ఘటనతో పోల్చిన టీఎంసీ ఎంపీ.. కేసు నమోదు

రామాయణంలో సీతామాత అపహరణను హథ్రాస్ ఘటనతో పోల్చుతూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సీతమ్మను ఉద్దేశిస్తూ కళ్యాణ్ బెనర్జీ అభ్యంతకర వ్యాఖ్యలు చేయడంతో నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయనపై హౌరాలోని గోల్బారీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కళ్యాణ్ బెనర్జీ మన హిందూ సంప్రదాయాలైన రామాయణం, మహాభారతాలను అవమానపరిచారని బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ ఆరోపించారు. ఇందుకుప్రతిగా ఆయనకు 2021లో సమాధానం లభించనుందని పరోక్షంగా అసెంబ్లీ ఎన్నికలను ప్రస్తావించారు. ‘సీతామాత... శ్రీరామునితో... నన్ను రావణాసుడు అపహరించాడు కాబట్టి సరిపోయింది.. ఎందుకంటే అదే అతని అనుచరుల ద్వారా జరిగివుంటే నా పరిస్థితి హథ్రాస్ బాధితురాలి మాదిరిగా ఉండేది’ అని కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఆయన బీజేపీ నేతలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ నేత అభ్యంతరకర వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ లాకెట్ చటర్జీ, మేఘాలయ, త్రిపుర మాజీ గవర్నర్ తథాగత్ రాయ్ తదితరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవత సీతామాతపై అవమానకర వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నందున పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా అత్యాచారాలు జరుగుతున్నాయని ఎంపీ లాకెట్ ఛటర్జీ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తమ రాష్ట్రం తరువాతనే యూపీ, రాజస్థాన్లను చూడాలని పేర్కొన్నారు. కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆయనపై బీజేపీ నేత ఆశీష్ జయపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే తన వ్యాఖ్యాలపై బెనర్జీ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ఎన్నికల ఇంఛార్జ్ కైలాష్ విజయ్వర్గీయ మాట్లాడుతూ.. బీజేపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి టీఎంసీకి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. ‘ఇవన్నీ చెత్త, అవివేకమైన వ్యాఖ్యలు.. ఇటువంటి వాటిపై నేను స్పందించను, ఎందుకంటే అవివేకులే ఈ వ్యాఖ్యలు చేస్తారు.. వారికి నేను చెప్పే సలహా ఒకటే ఓ సైకాలజిస్ట్ను సంప్రదించాలి’ అని అన్నారు. బెంగాల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. మేలో ఎన్నికలు జరగనుండగా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతి నెలా బెంగాల్లో పర్యటించాలని షెడ్యూల్లో నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో బీజేపీని అడ్డుకోడానికి సీఎం మమతా బెనర్జీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం బెంగాల్లో మమతకు ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు.
By January 11, 2021 at 08:00AM
No comments