Breaking News

లాల్ బహదూర్ శాస్త్రి.. ప్రజల కోసం బస్టాప్‌కు వెళ్లిన భారత ప్రధాని


భారత ప్రధానుల్లో లాల్ బహదూర్ శాస్త్రిది శైలి భిన్నం. ప్రధానిగా కొంతకాలమే పనిచేసినా భారతీయ యవనికపై ఆయన తనదైన ముద్ర వేశారు. అదే ఆయనను ధృడమైన నేతగా మన ముందు నిలబెట్టాయి. 1965 భారత్-పాకిస్థాన్ యుద్ధం సందర్భంగా ఆయన ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు, సంకల్పం, దీక్షా దక్షతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాక్‌తో యుద్ధం జరిగినపుడు అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్.. యుద్ధాన్ని ఆపకపోతే మేం మీకు పీఎల్ 480 కింద పంపించే ఎర్ర గోధుమలను ఆపేస్తామని బెదిరించారు. ఆ సమయంలో భారత్‌ గోధుమల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించకపోవడం వల్ల అమెరికా అలా బెదిరించడంతో చాలా ఆత్మాభిమానం కలిగిన శాస్త్రీజీ బాధపడ్డారు. దీంతో మనం వారంలో ఒక పూట భోజనం చేయడం మానేద్దామని, దానివల్ల అమెరికా నుంచి వచ్చే గోధుమలు సరఫరా తగ్గించవచ్చని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన పిలుపునకు లక్షలాది మంది ఒక పూట భోజనానికి దూరంగా ఉన్నారు. ఆ ప్రకటన చేయడానికి ముందు ముందు తన భార్య లలితా శాస్త్రితో మాట్లాడుతూ.. ‘మీరు ఈరోజు రాత్రి మన ఇంట్లో వంట చేయకండి. నేను రేపు దేశ ప్రజలను కూడా ఒక పూట భోజనం ఆపేయాలని కోరబోతున్నాను... నా పిల్లలు ఆకలితో ఉండగలరా, లేదా అనేది నేను చూడాలనుకుంటున్నాను’ అని చెప్పారు. పిల్లలు ఒక పూట భోజనం చేయకుండా ఉండగలమనేది చూసినప్పుడు, దేశ ప్రజలను కూడా అలాగే చేయాలని కోరాలని అనుకున్నారని ఆయన కుమారుడు ఒక సందర్భంలో తెలిపారు . శాస్త్రి ప్రధానిగా ఉన్నప్పడు ఆయన ఉపయోగించడానికి ప్రభుత్వం ఒక షెవ్రొలె ఇంపాలా కార్ ఇచ్చింది. ఆ కారును ఎవరైనా విదేశీ అతిథులు ఢిల్లీకి వచ్చినపుడు మాత్రమే ఉపయోగించేవారు. తన వ్యక్తిగత పనులకు వినియోగించవారు కాదు. కానీ, శాస్త్రీజీకి తెలియకుండా ఒక రోజు ఆ కారును ఆయన కుమారుడు సునీల్ శాస్త్రి తీసుకెళ్లాడు. తర్వాత ఆ విషయం తెలిసిన శాస్త్రీజీ.. కారు మొత్తం ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అని డ్రైవర్‌ను అడిగి.. మొత్తం ఖర్చును ప్రభుత్వ ఖాతాకు చెల్లించాలని కుమారుడ్ని ఆదేశించారు. ఒకసారి లాల్‌ బహదూర్ శాస్త్రి.. బిహార్‌ నుంచి వచ్చే కొందరికి కలవడానికి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. అదే రోజు అనుకోకుండా ఒక విదేశీ అతిథిని సత్కరించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ నుంచి తిరిగొచ్చేసరికి ఆలస్యం అయ్యింది. దీంతో ప్రధానిని కలవడానికి బిహార్ నుంచి వచ్చిన వారు నిరాశగా తిరుగుముఖం పట్టారు. వాళ్లు చాలా సేపు వేచిచూసి, అప్పుడే వెళ్లారని శాస్త్రీజీకి తెలిసింది. దాంతో ఆయన తన కార్యదర్శి ద్వారా ఎక్కడి వెళ్లుంటారో అని తెలుసుకుని, ఇంటి నుంచి బయట బస్టాప్ దగ్గరకు వెళ్లారు. ఆయన వ్యక్తిగత కార్యదర్శి వారిని తీసుకొస్తానని చెప్పినా శాస్త్రీజీ వినలేదు... స్వయంగా వెళ్లి వాళ్లను తీసుకొస్తా, ఈ పొరపాటుకు క్షమాపణ అడుగుతానని అన్నారు. ఆయన బస్టాప్‌కు వెళ్లి ఇంకా అక్కడే ఉన్న వారిని క్షమాపణలు అడిగారు, తర్వాత తనతో పాటూ ఇంట్లోకి తీసుకొచ్చారు. అంతకు ముందు ఇది ప్రజలకు తెలిస్తే ఏమనుకుంటారని సెక్రెటరీ అడిగితే.. నేను ఆహ్వానించిన వారిని కలవలేదని జనానికి తెలిస్తే అప్పుడు ఏమనుకుంటారని శాస్త్రీజీ ఎదురు ప్రశ్నించారు.


By January 11, 2021 at 10:57AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/second-prime-minister-of-india-lal-bahadur-shastri-death-anniversary/articleshow/80208662.cms

No comments