Breaking News

విజయవాడ.. అయోధ్య రామమందిరానికి విరాళాలు సేకరిస్తోన్న ముస్లిం మహిళ


అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర, విశ్వహిందూ పరిషత్‌లు విరాళాల సేకరణ కార్యక్రమాన్ని జనవరి 15న ప్రారంభించిన విషయం తెలిసిందే. మందిర నిర్మాణం కోసం కులమతాలకు అతీతంగా విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముస్లిం మహిళ సైతం ఆయోధ్య రామాలయం కోసం విరాళాల సేకరణ ప్రారంభించింది. విజయవాడలో తాహేరా ట్రస్ట్ నడుపుతోన్న జహారా బేగం.. రాముడికి విరాళాలు ఇవ్వాలని ముస్లిం వర్గాలను కోరుతున్నారు. ముస్లింలు సహా అన్ని వర్గాలూ వినాయకచవితి, దసరా, శ్రీరామనవమి ఉత్సవాల కోసం హిందూ సోదరులకు చందాలు ఇస్తారని, ఇది మన భారతీయ సంస్కృతి గొప్పదనమని ఆమె వ్యాఖ్యానించారు. నిధి సేకరణ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం రామమందిరానికి విరాళాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. ముస్లిం సమాజం ముందుకొచ్చిన విరాళాలు ఇవ్వాలని జహార్ బేగం కోరారు. మీకు తోచినంత ఇవ్వాలని, కనీసం 10 రూపాయలైనా విరాళంగా ఇవ్వొచ్చని అన్నారు. ముస్లిం సమాజం కోసం మసీదులు, దర్గాలతోపాటు సమాధుల నిర్మాణానికి హిందువులు తమ భూములను ఇచ్చారని, గత పదేళ్లుగా గ్రామాల్లో కలిసి పనిచేస్తున్నామన్నారు. ముస్లిమేతరులు తమ విలువైన వ్యవసాయ భూములను కూడా దానం చేసిన సందర్భాలున్నాయని జహారా అన్నారు. అంతేకాదు, మసీదులు, దర్గాల నిర్మాణానికి హిందువులు సాయం చేస్తున్నారని ఆమె తెలిపారు. ‘రాముడి పుట్టిన ఈ దేశంలో జన్మించాం.. మన కాలంలో ఆలయం నిర్మించబడటం అదృష్టం.. రాముడి ధర్మాన్ని ఒక జీవన విధానంగా బోధించాడు.. మొత్తం ప్రపంచానికి ఆయన ఒక ఉదాహరణగా నిలుస్తాడు’ అని వ్యాఖ్యానించారు. ఈ దైవ కార్యానికి అందరూ కలిసిరావాలని, భవ్యమైన రామమందిర నిర్మాణానికి హృదయపూర్వకంగా సహకరించాలని ఆమె విజ్ఞ‌ప్తి చేశారు. ‘భారతదేశం అంటే ఆధ్యాత్మికత, గొప్ప వారసత్వం, భిన్న సాంప్రదాయాలు, విభిన్న సంస్కృతులు, బహుళ భాషలకు నిలయం.. ప్రపంచంలోని మరే ఇతర దేశాలలోనూ ఈ వైవిధ్యం లేదు.. ముస్లింలతో సహా అన్ని వర్గాల ప్రజలు భారతదేశంలో అనేక ఇతర దేశాలకు భిన్నంగా స్వేచ్ఛను కలిగి ఉన్నారు.. ఇది భారతీయులుగా గర్వపడతారు’ అని వ్యాఖ్యానించారు.


By January 20, 2021 at 09:02AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/muslim-woman-raises-funds-for-the-construction-of-ram-temple-in-ayodhya/articleshow/80358104.cms

No comments