Breaking News

నరసాపురం:హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఇంట్లో రూ.70లక్షల చోరీ.. దొంగలు దొరికారిలా..!


నరసాపురంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి సీహెచ్‌ సోమయాజులు నివాసంలో రెండు నెలల క్రితం జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ చోరీకి పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.51.60లక్షల విలువైన బంగారు నగలు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నారాయణనాయక్‌ ఈ కేసు వివరాలను వెల్లడించారు. నరసాపురంలో నివాసముంటున్న హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్‌ సీహెచ్‌ సోమయాజులు కుటుంబంతో కలిసి గతేడాది నవంబరు నెలలో హైదరాబాద్‌ వెళ్లారు. అదే నెల 10న రాత్రి దొంగలు ఇంట్లోకి చొరబడి రూ.70.5లక్షల విలువైన బంగారు నగలు, వజ్రాలు దొంగిలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనాస్థలంలోని వేలిముద్రలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఆ వేలిముద్రలు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం కొంకాపల్లికి చెందిన పతివాడ లోవరాజు అనే పాత నేరస్తుడని తేల్చారు. అతడిపై గతంలో శ్రీకాకుళం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఓ దొంగతనం కేసు ఉందని గుర్తించారు. దీంతో లోవరాజు కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు పాలకొల్లు, నరసాపురం రోడ్డులోని దిగుమర్రు బైపాసు వద్ద అతడితో పాటు, స్నేహితుడు షేక్‌ నుమాన్‌ అహ్మద్‌ను సోమవారం అరెస్టు చేశారు. జైల్లో పరిచయమైన నిజామాబాద్‌కు చెందిన షేక్‌ నుమాన్‌ అహ్మద్‌కు లోవరాజు కొన్ని నగలు ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. నుమాన్‌ అహ్మద్‌ బంధువైన షేక్‌ సయ్యద్‌ తాబీజ్‌ వద్ద కూడా చోరీ చేసిన కొన్ని నగలను ఉంచారని, అతడి నుంచిసుమారు 21 కాసుల నగలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని ఎస్పీ తెలిపారు. నిందితుడు లోవరాజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. వ్యసనాలకు బానిసై చదువు మానేసిన అతడు గతంలో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో శిక్ష కూడా అనుభవించాడు. విజయవాడ, అమలాపురం, కాకినాడ, విజయనగరం, హైదరాబాద్ ప్రాంతాల్లో పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు.


By January 12, 2021 at 11:22AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/west-godavari-police-arrests-two-thives-51-lakhs-recovered/articleshow/80225297.cms

No comments