Breaking News

రైతుల భారత్ బంద్.. ఆ మార్గాల్లో ప్రయాణించేవారికి ట్రావెల్ అడ్వైజరీ


కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతు సంఘాలు పిలుపు మేరకు మంగళవారం ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమయ్యింది. ఈ నేపథ్యంలో ఢిల్లీతోపాటు శివార్లలోని పలు ప్రధాన రహదారులను ముందుజాగ్రత్తగా ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు. ఢిల్లీ శివార్లలోని సింఘు, ఆచండి, పియావో మణియారి, మంగేష్, తిక్రీ, జరోడా సరిహద్దులను మూసివేసినట్లు వెల్లడించారు. జాతీయ రహదారి 44ను రెండు వైపులా మూసివేయగా... ఘజియాబాద్- ఢిల్లీ జాతీయ రహదారిని గాజిపూర్ సరిహద్దు వద్ద మూసివేశారు. 44వ నంబరు జాతీయ రహదారిని మూసివేయడంతో ప్రయాణికులు లంపూర్, సఫియాబాద్, సబోలి సరిహద్దుల ద్వారా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ముకార్బా, జిటికే రహదారి నుంచి ట్రాఫిక్‌ను మళ్లించిన పోలీసులు.. నోయిడా లింకు రోడ్డులోని చిల్లా సరిహద్దును కూడా మూసివేశారు. గౌతమ్ బుద్ధ‌నగర్‌లో నోయిడా లింక్ రోడ్డును మూసివేసినట్టు తెలిపారు. భారత్ బంద్ సందర్భంగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్ అడ్డంకులున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. హర్యానా రాష్ట్రంలోని పలు రహదారులపై రైతులు ధర్నా చేస్తున్నారని, దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని అదనపు డీజీపీ నవదీప్ సింగ్ వివరించారు. ఢిల్లీ-అంబాలా, ఢిల్లీ -హిస్సార్, ఢిల్లీ- పాల్వాల్, ఢిల్లీ -రేవారి ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఖుర్కిదౌలా టోల్ ప్లాజా, హీరోహోండా చౌక్, రాజీవ్ చౌక్, ఇఫ్కో చౌక్, శంకర్ చౌక్ ల నుంచి ట్రాఫిక్‌ను మళ్లించినట్టు గురుగ్రామ్ డీసీపీ భరద్వాజ్ చెప్పారు. రైతుల నిరసనలతో ఘజియాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే రోడ్డును మూసివేసి, నోయిడాలో ముందు జాగ్రత్త చర్యగా 144 సెక్షన్ ను విధించారు.


By December 08, 2020 at 09:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bharat-bandh-today-amid-farmer-protests-delhi-police-issued-travel-warning/articleshow/79618136.cms

No comments