Breaking News

చైనీయులను విమానాల్లో ఎక్కించవద్దు.. విమానయాన సంస్థలకు కేంద్రం ఆదేశాలు!


చైనా పౌరులను విమానాల్లోకి అనుమతించవద్దని అన్ని విమానయాన సంస్థలను భారత్ అనధికారికంగా కోరింది. నవంబరు నుంచి భారత పౌరులను తమ దేశంలోకి రాకుండా చైనా నిషేధం విధించింది. చైనా చర్యలకు సరైన బదులు చెప్పాలని భావిస్తోన్న భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. భారత్-చైనాల మధ్య విమాన ప్రయాణాలపై నిషేధం కొనసాగుతోంది. అయితే, ప్రస్తుత విదేశీ ప్రయాణికుల నిబంధనల ప్రకారం చైనీయులు భారత్‌కు రావచ్చు. కరోనా లాక్‌డౌన్ తర్వాత అంతర్జాతీయ విమాన ప్రయాణాల కోసం పలు దేశాలతో భారత్ ఎయిర్ బబూల్స్ తెరించింది. దీంతో ఆ దేశాల్లో నివసించే చైనా పౌరులు వ్యాపార, ఉద్యోగ పనుల కోసం భారత్ రావడానికి అవకాశం కలిగింది. అయితే, చైనా పౌరులు తమ విమానాల్లో భారత్‌లోకి ప్రయాణించవద్దని గతవారం రోజులుగా స్వదేశీ, విదేశీ విమానయా సంస్థలు స్పష్టంగా చెబుతున్నాయి. టూరిస్ట్ వీసాలను తాత్కాలికంగా రద్దుచేసిన భారత్.. వ్యాపార, ఇతర విభాగాలకు చెందిన విదేశీ వ్యక్తులను నాన్-టూరిస్ట్ వీసాలపై అనుమతిస్తోంది. ఐరోపాలోని ఎయిర్ బబూల్స్ దేశాల నుంచి చాలా మంది చైనీయులు భారత్‌కు వస్తున్నట్టు విమానయా సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం భారత్‌కు టిక్కెట్లు బుక్ చేసుకున్న చైనా పౌరులకు బోర్డింగ్ నిరాకరించడానికి కారణం చెప్పడానికి తమకు లిఖితపూర్వకంగా ఏదో ఒక ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను కొన్ని విమానయాన సంస్థలు కోరాయి. చైనాలోని వివిధ ఓడరేవులలో భారతీయులు చిక్కుకున్నప్పుడు, వారిని తమ తీరంలో దిగడానికి డ్రాగన్ నిరాకరించింది. దీంతో అంతర్జాతీయ వాణిజ్య ఓడల్లో పనిచేస్తున్న దాదాపు 1,500 మంది భారతీయ సిబ్బంది స్వదేశానికి చేరుకోలేకపోయారు. దీనిపై కేంద్రంగా స్పందించింది. ఆస్ట్రేలియాను లక్ష్యంగా చేసుకున్న చైనా.. ఆ దేశం నుంచి బొగ్గు దిగుమతిని నిషేధించింది. దీంతో సరుకు రవాణా చేసే భారతీయ నౌకలు, అందులోని సిబ్బంది తీవ్ర ఇబ్బందు ఎదుర్కొన్నా.. తక్షణ ఉపశమన చర్యలకు చైనా సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. దీనిపై ఇటీవల వివరణ కోరగా.. బంతిని స్థానిక అధికారుల కోర్టులోకి చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ నెట్టింది. కానీ ఏ స్థానిక అథారిటీ నుంచి అనుమతులు రావని అధికారులు పేర్కొన్నారు. చైనా వెల్లడించిన విధానాలు భారత ప్రయత్నాలను నిరాశపరిచే విధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. మహమ్మారి కారణంగా భారత్ సహా విదేశీ పౌరులకు వీసాలను నవంబరులో నిలిపివేసిన చైనా.. మంజూరు చేసిన వాటిని రద్దుచేసింది. ‘చైనా రాయబార కార్యాలయం / కాన్సులేట్లలో పైన పేర్కొన్న వర్గాలకు వీసా లేదా నివాస అనుమతులకు సంబంధించి ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయబోం’ అని భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం నవంబర్ 5 న తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.


By December 28, 2020 at 11:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/dont-fly-in-chinese-nationals-india-strong-retaliatory-push-to-china/articleshow/79986996.cms

No comments