Breaking News

మరోసారి గొప్ప మనసు చాటుకున్న భారత సైన్యం..కానుకలతో పీవోకే బాలికల అప్పగింత


పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) నుంచి పొరపాటున భారత సరిహద్దులోకి వచ్చిన ఇద్దరు మైనర్‌ బాలికలను అధికారులు తిరిగి వారి స్వస్థలానికి పంపించారు. పీవోకేకి చెందిన చకన్‌ దా బాగ్‌ క్రాసింగ్‌ పాయింట్‌ వద్ద లైబా జబైర్‌(17), సనా జబైర్‌ (13)అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లను అధికారులకు అప్పగించారు. స్వీట్లు, పలు కానుకలతో బాలికలను అధికారులు సాగనంపడం విశేషం. సైనికులు తమను కొడతారేమోని భయపడ్డామని, కానీ చాలా బాగా చూసుకున్నారని బాలికలు సంతోషం వ్యక్తం చేశారు. ‘మేం దారి తప్పి భారత భూభాగంలోకి వచ్చాం.. మమ్మల్ని ఇంటికి పంపించరేమోనని భయపడ్డాం... కానీ మరుసటి రోజే పంపించేశారు.. ఇక్కడ ప్రజలు చాలా మంచివారు’ అని లైబా జబైర్‌ వ్యాఖ్యానించింది. ఆదివారం తెల్లవారుజామున జమ్మూ-కశ్మీర్‌ పూంచ్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి గస్తీ నిర్వహిస్తున్న భారత భద్రతా బలగాలు.. ఈ బాలికలను గుర్తించాయి. ఈ ఇద్దరూ పీఓకేలోని కథువాకు చెందిన బాలికలుగా గుర్తించిన సైన్యం.. వారిని తిరిగి స్వస్థలాలకు క్షేమంగా చేర్చారు. ఆదివారం ఉదయం బాలికలను అదుపులోకి తీసుకున్న సైనిక అధికారులు.. 24 గంటల అనంతరం పాకిస్థాన్ సైనికాధికారులు, స్థానిక పౌరుల సమక్షంలో అప్పగించారు. రక్షణశాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. పీఓకేలోని కథువా తాలూకా అబ్బాస్‌పూర్ గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు దారితప్పి వచ్చినట్టు తెలిపారు. పూంచ్ సెక్టార్‌లోని చకన్ దా బాగ్ నియంత్రణ రేఖ వద్ద మోహరించిన భారత దళాలు వీరి క్రాసింగ్‌ను గుర్తించాయని పేర్కొన్నారు.


By December 08, 2020 at 08:06AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indian-army-sent-back-pok-minor-sisters-who-inadvertently-entering-india/articleshow/79617425.cms

No comments