ఆరుసార్లు కొరడా దెబ్బలు తిన్న ముఖ్యమంత్రి.. ఎందుకో తెలుసా?
ప్రజల శ్రేయస్సు కోరుతూ చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తన చేతిపై కొరడాతో కొట్టించుకున్నారు. దుర్గ్ జిల్లా జజంగిరి గ్రామంలో దీపావళి రోజు సంప్రదాయంగా జరిగే గోవర్ధన్ పూజలో సీఎం భూపేశ్ ఏటా పాల్గొంటారు. ఈ సమయంలో ఆయన తన చేతిపై కొరడాతో కొట్టించుకునే సంప్రదాయం పాటిస్తారు. ఈ దీపావళికీ హాజరైన ఆయన అదే ఆచారాన్ని కొనసాగించారు. చేతిపై ఆరుసార్లు కొరడాతో కొట్టించుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గోవర్దన పూజలో కొరడాతో దెబ్బలు కొట్టించుకోవడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని నమ్మకం. సీఎం భూపేశ్ బఘేలా సైతం తమ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని, ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఆలయం వద్ద బీరేంద్ర ఠాకూర్ అనే వ్యక్తి సీఎం చేతిపై కొరడాతో కొట్టారు. కొరడాతో బలంగా కొడుతున్నా సీఎం ప్రశాంతంగా నిలబడ్డారు. అసలు తనకు నొప్పే లేదన్నట్టు ఉన్నారు. ఈ ఆచారం పూర్తయిన తర్వాత సీఎం పాదాలకు బీరేంద్ర ఠాకూర్ నమస్కారం చేసి ఆశీసులు తీసుకోవడం గమనార్హం. గతంలో ఈ ఆచారం బీరేంద్ర తండ్రి భొరసా ఠాకూర్ నిర్వహించేవారు. ఆయన చనిపోవడంతో దీనిని కొడుకు బీరేంద్ర కొనసాగిస్తున్నారు. సీఎం మాట్లాడుతూ.. భొరసా సంప్రదాయాన్ని కుమారుడు బీరేంద్ర కొనసాగించడం చాలా సంతోషకరమని అన్నారు. రాష్ట్ర ప్రజల క్షేమంగా ఉండాలని, కరోనా మహమ్మారి నుంచి త్వరగా విముక్తి లభించాలని కోరుకున్నారు. మహమ్మారి కారణంగా ప్రజలందరితో కలిసి పూజలు చేయడానికి అవకాశం లేకుండా పోయిందని, తనను క్షమించాలని వ్యాఖ్యానించారు. ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, భౌతికదూరం పాటించాలని సీఎం సూచించారు.
By November 16, 2020 at 07:06AM
No comments