Breaking News

ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గాన్ని ప్రారంభించనున్న మోదీ.. దీని ప్రత్యేకతలివే


హిమాలయ పర్వతాల వద్ద నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద సొరంగ మార్గాన్ని ప్రధాని మోదీ శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్‌ వద్ద నిర్మించిన ఈ సొరంగం వల్ల మనాలి-లేహ్ మధ్య 475 కిలోమీటర్ల దూరం 46 కిలోమీటర్లకు తగ్గుతుంది. దీని వల్ల దాదాపు నాలుగున్నర గంటల సమయం ఆదా అవుతుంది. మొత్తం 9.02 కిలోమీటర్ల ఈ సొరంగ మార్గానికి మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టారు. అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునేలా అత్యాధునిక సాంకేతికతతో దీనిని నిర్మించారు. 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా నిర్మాణం సాగింది. శుక్రవారం హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మనాలి- లేహ్‌ మార్గంలో నిర్మించిన 3 కీలక వంతెనలను ప్రారంభించారు. కాగా, అటల్‌ సొరంగ మార్గం ప్రారంభోత్సవ ఏర్పాట్లకు వచ్చిన సిబ్బందిలో 17 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో పోలీసులు, పర్యాటక శాఖ ఉద్యోగులు, పీఎంవో కార్యాలయ డ్రైవర్లు ఉన్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం ప్రధాని కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ ఏడాది మే నెలలో ఇది ప్రారంభంకావాల్సి ఉన్నా లాక్‌డౌన్‌ కారణంగా ఆలస్యమైంది. ఇక, వాజ్‌పేయి హయాంలోనే 2000 జూన్‌ 3న ఈ సొరంగ మార్గం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల తర్వాత 2002 మే 26న నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, ఆరేళ్లలో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాతావరణ పరిస్థితులు, ఇతరత్రా కారణాల వల్ల ఇప్పటికి ఇది అందుబాటులోకి వచ్చింది. గతంలో రోహ్‌తంగ్ టన్నెల్‌గా పిలిచే ఈ మార్గానికి 2019 డిసెంబరు 24న అటల్‌ టన్నెల్‌గా నామకరణం చేశారు. బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ) ఈ సొరంగ మార్గం నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది. హిమాలయాల్లోని పిర్‌ పంజాల్‌ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో అత్యాధునిక ప్రమాణాలతో దీన్ని నిర్మించారు. ఏడాది పొడవునా మనాలీని లాహౌల్-స్పితి లోయతో మంచు కప్పి ఉంచుంది. శీతకాలంలో లాహౌల్‌-స్పితి వ్యాలీలోని ఇతర ప్రాంతాలకు ఆరు నెలలపాటు పూర్తిగా రాకపోకలు నిలిచిపోతాయి. ఈ మార్గం నిర్మాణంతో ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా రాకపోకలు సాగనున్నాయి. అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొనేలా అత్యాధునిక సాంకేతికతతో ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. దక్షిణ ముఖద్వారం మనాలీకి 25 కి.మీ. దూరాన సముద్ర మట్టానికి 3,060 మీటర్ల ఎత్తులోనూ, ఉత్తర ద్వారం లాహౌల్‌లోని తేలింగ్ సిస్సు గ్రామ సమీపంలో సముద్ర మట్టానికి 3,071 మీటర్ల ఎత్తులో ఉంది. గుర్రపు నాడా ఆకారంలో ఉండే ఈ సొరంగం మార్గం వెడల్పు 10.5 మీటర్లు. ఇందులో 8 మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మించారు. అంటే సింగిల్‌ ట్యూబ్‌లో రెండు లైన్ల రోడ్లను నిర్మించారు. 5.525 మీటర్ల ఓవర్‌ హెడ్ క్లియరెన్స్‌ సౌకర్యం ఉంది.


By October 03, 2020 at 08:30AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-modi-to-inaugurate-strategic-atal-tunnel-at-himachal-pradesh-today/articleshow/78456609.cms

No comments