ప్రాణం తీసిన పొలం.. తాత మనవడి దారుణ హత్య


పొలం హద్దు ప్రాణం తీసింది. తాతమనవడ్ని బలితీసుకుంది. ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. ఊరంతా చూస్తుండగానే.. తాతమనవళ్లు దారుణ హత్యకు గురయ్యారు. పెబ్బేరు మండలం శాఖాపూర్(వై) గ్రామంలో శుక్రవారం పొలం విషయంలో ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. శాఖాపూర్కు చెందిన శాంతన్నకు, అదే గ్రామానికి చెందిన పరశురాముడికి పక్కపక్కనే పొలాలు ఉన్నాయి. వాటి హద్దుల విషయంలో కొంతకాలంగా గొడవ జరుగుతుండగా.. ఇటీవల గ్రామ పెద్దల సూచనల మేరకు హద్దులు నిర్ణయించుకున్నారు. అయితే తనకు అన్యాయం జరిగిందంటూ పరశురాముడు.. శాంతన్న పొలాన్ని కొంత దున్నడంతో గురువారం వారిద్దరి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. దీంతో సమస్యను పరిష్కరించడానికి శుక్రవారం మధ్యాహ్నం కొందరు గ్రామస్థులు పొలం దగ్గరికి వెళ్లారు. అక్కడ మాటామాట పెరగగా.. పరశురాముడు అందరు చూస్తుండగానే శాంతన్నను కత్తితో పొడిచాడు. అడ్డుగా వెళ్లిన శాంతన్న మనవడు రామకృష్ణపైనా కూడా దాడి చేశాడు.దీంతో వారిద్దర్నీ హుటాహుటిన వనపర్తి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు స్థానికులు. అయితే మార్గం మధ్యలోనే ఇద్దరు కూడా మృతి చెందారు. మరోవైపు ఈ ఘటనలో పరశురాముడికి, అతని వెంట ఉన్న శివుడికి గాయాలయ్యాయి. సీఐ మల్లికార్జున్రెడ్డి, ఎస్సై రాఘవేందర్రెడ్డి సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ అపూర్వారావు, డీఎస్పీ కిరణ్కుమార్ పరిశీలించారు. పరుశురాముడ్ని కూడా అదుపులోకి తీసుకొని విచారించారు.
By September 26, 2020 at 08:25AM
No comments