రూమర్స్కు చెక్: శశికళ విడుదల ఇప్పట్లో కాదు.. వచ్చే ఏడాది జనవరిలో!

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న ఆమె స్నేహితులు శశికళ త్వరలోనే విడుదలవుతారంటూ ప్రచారం సాగుతోంది. అమె ముందస్తు విడుదలపై ప్రచారం ఊపందుకుంది. అయితే, వచ్చే ఏడాది జనవరి 27 న ఆమె విడుదలవుతున్నట్టు ఆర్టీఐ ద్వారా వెల్లడయ్యింది. శశికళ విడుదలపై ఓ వ్యక్తి ఆర్టీఐని ఆశ్రయించగా ఈ మేరకు స్పష్టం చేసింది. దీంతో ఆమె విడుదలపై జరుగుతోన్న ప్రచారానికి తెరపడింది. అక్రమాస్తుల కేసులో శశికళకు సుప్రీంకోర్టు రూ.10 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ జరిమానాను ఆమె చెల్లించలేకపోతే అదనంగా మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అక్రమార్జన కేసులో బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ సెప్టెంబరు నెలాఖరున విడుదలయ్యే అవకాశముందని ఆమె తరఫు న్యాయవాది రాజా సెంధూర్ పాండ్యన్ గతవారం వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సత్ప్రవర్తన కారణంగా గత మార్చిలోనే ఆమె విడుదలకు అర్హత పొందారని తెలిపారు. ఈ నెలాఖరున గానీ, అక్టోబర్ మొదటి వారంలోపు గానీ శశికళ విడుదలవుతారని ఆయన పేర్కొన్నారు. అలాగే, శశికళ త్వరలో విడుదల కానున్నారని ఏఎంఎంకే జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పొన్రాజా ఇటీవల జయలలిత జయంతి వేడుకల్లో వెల్లడించారు. శశికళ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. ప్రధానంగా పళనిస్వామి ముఖ్యమంత్రి పదవి కోల్పోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
By September 15, 2020 at 12:33PM
No comments