Breaking News

చైనాలో మరో మాయదారి వైరస్: ఏడుగురు మృతి.. వ్యాధి లక్షణాలు ఇవే


ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ పురుడుపోసుకున్న చైనాలో మరో మాయదారి రోగం వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ బారినపడి ఇప్పటి వరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోగా... మరో 60 మంది దీని బారినపడ్డారు. ఈ మేరకు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మనుషుల్లో ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందని హెచ్చరించింది. తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌ల్లో గత నెలలో 37 మందికి పైగా తీవ్రమైన జర్వంతో కూడిన థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ బున్యావైరస్ () బారినపడ్డారు. తర్వాత అన్హుయి ప్రావిన్స్‌లో 23 మందికి ఈ వైరస్ సోకినట్టు గుర్తించినట్లు గ్లోబల్ టైమ్స్ తెలిపింది. జియాంగ్సు రాజధాని నాన్జియాంగ్‌కు చెందిన ఒక మహిళకు వైరస్ సోకగా.. మొదట్లో దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించాయి. ఆమె శరీరంలో ల్యూకోసైట్స్, ప్లేట్‌లెట్స్ తగ్గినట్లు వైద్యులు గుర్తించారు. నెల రోజుల పాటు చికిత్స తర్వాత ఆమె కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. గ్లోబల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్సుల్లో కనీసం ఏడుగురు ఈ వైరస్ కారణంగా మరణించారు. ఇక, SFTS వైరస్‌ను తొలిసారి చైనాలో 2011లోనే కనుగొన్నారు. జంతువుల శరీరానికి అంటుకుని, తరువాత మానవులకు వ్యాపించే నల్లి (టిక్) వంటి కీటకాల ద్వారా వైరస్ వ్యాపించి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. మనుషుల నుంచి మనుషులకు ఈ వైరస్ వ్యాపించే విషయంలో ఎలాంటి మినహాయింపు లేదని జిన్జియాంగ్ యూనివర్సిటీ హాస్పిటల్ వైద్యుడు షెంగ్ జిఫాంగ్ అన్నారు. ఈ వైరస్ బారినపడిన వ్యక్తుల రక్తం లేదా శ్లేషం ద్వారా సంక్రమిస్తుంది. నల్లి వంటి కీటకాల కాటువల్ల వైరస్ వ్యాపిస్తుందని హెచ్చరించిన వైద్యులు... ప్రజలు జాగ్రత్తలు తీసుకున్నంత కాలం అంటువ్యాధిపై భయపడాల్సిన అవసరం లేదన్నారు. ‘గత పదేళ్లలో తూర్పు ఆసియాలో తీవ్రమైన జ్వరం, థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ కేసులలో గణనీయమైన పెరుగుదల ఉంది. నల్లి కుట్టిన తర్వాత అధిక జ్వరం, ల్యూకోపెనియాతో సహా క్లినికల్ సంకేతాలు ఉంటాయి’ అని చైనా మూలాలున్న వైరస్‌లపై పరిశోధనలు చేస్తున్న అమెరికా వైరాలజిస్ట్‌లు వ్యాఖ్యానించారు. మానవులతో పాటు మేకలు, పశువులు, గుర్రాలు, పందులు సహా వ్యవసాయ జంతువులలోని జన్యు హోమోలజీతో కూడా వైరస్ కనుగొన్నారు. ఇంకా, తీవ్రమైన జ్వరం,త్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ వైరస్ (SFTSV) జన్యురూపాలు ప్రస్తుతం మానవులు, జంతువుల మధ్య కలిసి ప్రయాణిస్తున్నాయి.


By August 06, 2020 at 09:35AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/new-contagion-passed-via-tick-bites-emerges-in-china-7-dead-60-take-ill-says-global-times/articleshow/77385368.cms

No comments