గుడ్ న్యూస్ చెప్పిన రైల్వేశాఖ.. ఉద్యోగులకు ఆరోగ్య బీమా!

ఉద్యోగులకు త్వరలో మరో శుభవార్త అందించనుంది. పథకాన్ని అందుబాటులోకి తీసురానుంది. ఈ మేరకు ప్రతిపాదనలు చేసినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. ఇప్పటికే తమ శాఖలోని 13 లక్షల మంది ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులకు ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తున్నామని, దీని పరిధిని మరింత విస్తరింపజేయడంపై కసరత్తు చేస్తున్నామని వెల్లడించింది. సమగ్ర ఆరోగ్య బీమా పథకంలో అన్ని అంశాలను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. వైద్య, అత్యవసర పరిస్థితులు, ఇతరత్రా ఆర్థిక నష్టాలకు వ్యతిరేకంగా బీమాను అందించే ఉద్దేశంతో సిబ్బంది కోసం సమగ్ర ఆరోగ్య బీమా పథకం తీసుకురానున్నట్టు పేర్కొంది. దీనిపై అన్ని జోన్లు, ప్రొడక్షన్ యూనిట్ల జనరల్ మేనేజర్ల నుంచి సలహాలు, సూచనలు కోరినట్టు తెలిపింది. భారత రైల్వేలో 586 ఆరోగ్య యూనిట్లు, 45 సబ్- డివిజనల్ ఆస్పత్రులు, 56 డివిజనల్ ఆస్పత్రులు, ఎనిమిది ప్రొడక్షన్ యూనిట్ ఆసుపత్రులు, 16 జోనల్ ఆస్పత్రులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 2500కి పైగా వైద్యులు, 35,000 మంది పారామెడికల్ సిబ్బంది రైల్వే పనిచేస్తున్నారు. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభించడంతో బాధితుల చికిత్స కోసం 6,500కిపైగా పడకలు కేటాయించింది. దేశవ్యాప్తంగా మొత్తం 125 రైల్వే ఆస్పత్రుల్లోని సగం పడకలు కోవిడ్ రోగుల చికిత్సకు వినియోగిస్తున్నారు.
By August 20, 2020 at 08:32AM
No comments