Breaking News

దేశంలో కరోనా అంతానికి కౌంట్‌డౌన్ ఆరంభం.. మరో 73 రోజుల్లో వ్యాక్సిన్!


దేశంలో కరోనా వైరస్ విశ్వరూపం కొనసాగుతోన్న వేళ.. మహమ్మారికి వ్యాక్సిన్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మరో 73 రోజుల్లో కోవిడ్-19ను అంతం చేసే బ్రహ్మాస్త్రం సిద్ధమవుతుండగా, ప్రజలందరికీ దీనిని ఉచితంగా అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌ను శనివారం ప్రకటించింది. దేశంలో ఇప్పటికే మూడు వ్యాక్సిన్‌లు క్లినికల్ దశలో ఉన్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, దేశంలో కోవిడ్‌కు తొలి వ్యాక్సిన్ సీరమ్ ఇనిస్టిట్యూట్ నుంచి పేరిట రానుంది. ఆక్స్ ఫర్ట్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘కోవీషీల్డ్’వ్యాక్సిన్ మరో 73 రోజుల్లో అందుబాటులోకి రానుందని, సీరమ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి 'బిజినెస్ టుడే'కు వివరాలను వెల్లడించారు. ఇప్పటికే కేంద్రం నుంచి తమకు ఆదేశాలు అందాయని, ప్రత్యేక ప్రాధాన్యత ఉత్పత్తి లైసెన్స్‌ను కూడా ఇచ్చినట్టు తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారం అన్ని రకాల పరీక్షల అనంతరమే ఈ వ్యాక్సిన్ ను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ 58 రోజుల్లో ముగియనున్నట్టు వివరించారు. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిట్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ భారత్ శనివారం నాడు ప్రారంభించినట్టు పేర్కొన్నారు. మరో 29 రోజుల తరువాత రెండో డోస్ ఇస్తామని, దాని తరువాత 15 రోజల్లోనే ఫలితాల వెల్లడి ప్రారంభం అవుతుందని ఆయన అన్నారు. తుది ఫలితాలు వెల్లడించే సమయానికి టీకాను వాణిజ్యంగా విడుదల చేయాలన్నది తమ అభిమతమని ఆయన అన్నారు. గతంలో వ్యాక్సిన్‌ను పరిశీలించాలంటే గరిష్ఠంగా ఏడు నుంచి ఎనిమిద నెలల సమయం పట్టేదని, ప్రస్తుతం మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా ఈ సమయాన్ని తగ్గించామని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, దేశవ్యాప్తంగా 17 కేంద్రాలలో 1600 మంది వాలంటీర్లపై వ్యాక్సిన్ ప్రయోగాలకు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్ అనుమతి పొందిన విషయం తెలిసిందే. మరోవైపు, భారత్‌ సహ 92 దేశాల్లో వ్యాక్సిన్‌ను విక్రయించేందుకు సీరమ్ ఇనిస్టిట్యూట్, ఆస్ట్రాజెనికాల మధ్య కుదిరింది. కేంద్రం సైతం ఇప్పటికే వ్యాక్సిన్ ఉత్పత్తిపై సీరమ్‌తో ఒప్పందం చేసుకుంది. దేశంలోని 130 కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ వేసేందుకు 68 కోట్ల డోస్‌లను వచ్చే సంవత్సరం జూన్ నాటికి అందించే దిశగా ప్రణాళికలు సిద్దం చేసింది. మిగతా వారికి భారత్ బయోటెక్, జైడస్ కాడిలా తయారు చేస్తున్న దేశీయ వ్యాక్సిన్‌ను అందజేయనుంది. అయితే, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ట్రయల్స్ ఎప్పటికి పూర్తవుతాయనే విషయంపై ఇంకా కేంద్రానికి సమాచారం ఇవ్వలేదు. హడావుడిగా వ్యాక్సిన్ ఇవ్వాలని భావించడం లేదని, దాని భద్రత, సమర్ధతను పూర్తిగా పరిశీలించిన తరువాతే విడుదల చేస్తామని భారత్ బయోటెక్ సీఎండీ ఎల్లా కృష్ణ ఇప్పటికే వెల్లడించారు. మరోవైపు, తొలి దశలో నెలకు 6 కోట్ల డోసులు, ఆపై వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి నెలకు 10 కోట్ల డోస్‌లను ఉత్పత్తి చేయాలని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇప్పటికే రూ. 200 కోట్ల ఖర్చుచేసి ఉత్పత్తికి లైసెన్స్ కూడా సిద్ధం చేసింది. ప్రపంచంలోనే అత్యధికంగా వ్యాక్సిన్2లను ఉత్పత్తి చేసే కంపెనీగా గుర్తింపు పొందిన సీరమ్.. ఏడాదికి 150 కోట్ల డోస్‌లను తయారు చేసే సామర్థ్యం కలిగి ఉంది. అల్పాదాయ దేశాలకు వ్యాక్సిన్ అందజేయడానికి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ 150 మిలియన్ డాలర్లు నిధులను సీరమ్‌కు సమకూర్చడానికి ముందుకొచ్చింది. దాదాపు 10 కోట్ల డోస్‌లను ఉత్పత్తి చేసి, పేద దేశాలకు అందజేయనున్నారు. కోవిడ్-19 వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు జరుగుతున్నాయని, ఈ ఏడాది చివరి నాటికి టీకా అందుబాటులోకి వస్తుందనే నమ్మకంతో ఉన్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్‌వర్దన్ అన్నారు.


By August 23, 2020 at 08:48AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/first-coronavirus-vaccine-will-be-commercialised-in-73-days-indians-to-get-free-shots/articleshow/77699681.cms

No comments