రోడ్డు ప్రమాదంలో.. చిరంజీవి చిన్ననాటి స్నేహితుడు దుర్మరణం


సూర్యాపేటలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. చివ్వేంల మండలం కాసింపేట రోడ్డు జంక్షన్లో శుక్రవారం నిన్న ఉదయం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ట్యాంకర్ను కారు వెనుక నుంచి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతూ చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు విజయవాడకు చెందిన విజయకుమారి, సత్యానందం, జోసఫ్గా పోలీసులు గుర్తించారు. విజయవాడ నుంచి హైదరాబాద్కు వైద్య చికిత్స నిమిత్తం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన సత్యానందం, మెగాస్టార్ బాల్య స్నేహితులు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని ఆగర్తిపాలేనికి చెందిన మైలాబత్తుల సత్యానందం టీచర్గా పనిచేస్తున్నారు. చిరంజీవి, సత్యానందం ఇద్దరూ బాల్య స్నేహితులు. నరసాపురం వైఎన్ కళాశాలలో ఇద్దరూ కలిసి డిగ్రీ చదువుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి సినిమాల్లోకి రాగా, సత్యానందం టీచర్గా స్థిరపడ్డారు. రాజమండ్రి డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆయన భార్య విజయకుమారి కూడా ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. వీరికి కుమారుడు జోసఫ్, కుమార్తె ఉన్నారు. విజయకుమారి అనారోగ్యంతో బాధపడుతుండడంతో చికిత్స కోసం సత్యానందం, జోసెఫ్తో కలిసి కారులో నిన్న తెల్లవారుజామున విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యంలో సూర్యాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరు ముగ్గురూ దుర్మరణం పాలయ్యారు.
By June 27, 2020 at 11:44AM
No comments