Breaking News

Sino-India Border తూర్పు లడఖ్‌లో భారీగా సైన్యాన్ని మోహరించిన భారత్!


చైనా దుందుడుకు చర్యలతో సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాల మధ్య పరిష్కారం కాని ప్రాంతాల్లో నాలుగు నుంచి ఐదుచోట్ల చైనా సైన్యం నిరంతరం కవ్వింపు చర్యలకు పాల్పడటంతో భారత్ అప్రమత్తమయ్యింది. తూర్పు లడఖ్‌లోని సైనిక బలగాలను మోహరించి, డ్రాగన్‌కు ధీటుగా బదులివ్వడానికి సిద్ధమయ్యింది. ఇతర ప్రాంతాల నుంచి అదనపు పదాతి దళాలను లడఖ్‌లోని కొన్ని కీలక ప్రదేశాలకు తరలించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దుస్సాహసానికి పాల్పడితే ధీటుగా సమాధానం చెప్పడానికి దళాలను సిద్ధం చేసినట్టు పేర్కొన్నాయి. అలాగే లేహ్ బేస్డ్ ఇన్‌ఫాంట్రీ డివిజన్‌కు చెందిన కొన్ని యూనిట్లను కూడా అప్రమత్తం చేశారు.. వారిని శాశ్వత ప్రదేశాల నుంచి మరింత ముందు ప్రాంతాలకు తరలించారు. చైనాతో సరిహద్దుల్లోని లడఖ్ వద్ద క్షేత్రస్థాయి పరిస్థితి అంచనా వేయడానికి ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే శుక్రవారం పర్యటించి.. సమీక్ష నిర్వహించారు. కానీ, ఇరు దేశాల సైనిక దౌత్య విభాగాలు మాత్రం ఉద్రిక్తతను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. దాదాపు నెల రోజులుగా పాంగాంగ్ సరస్సు ఉత్తర ప్రాంతంలో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే, సైనిక ప్రతిష్ఠంభన ఇప్పటికీ కొనసాగుతుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. పాంగాంగ్ సరస్సు వద్ద మే 5, 6 తేదీల్లో ఇరు సైన్యాలు ఘర్షణకు దిగి.. ఒకరిపై ఒకరు పిడుగుద్దులు కురిపించుకున్నారు. పెట్రోలింగ్ దళాలు బాహాబాహీకి దిగాయి. డోక్లాం కూడలిలో భారత్, చైనా సైన్యం మధ్య 73 రోజుల పాటు కొనసాగిన ఉద్రిక్తతలు చర్చల ద్వారా పరిష్కారం అయిన రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ ఇరు సైన్యాల మధ్య వివాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా గాల్వన్ లోయ సమీపంలో తొలుత 1,200 మంది చైనా సైనికులు 80 నుంచి 100 గుడారాలు, బంకర్లు వేసుకోవడంతో వివాదం రాజుకుంది. దీనికి 500 మీటర్ల దూరంలోనే చైనా సైన్యానికి ఎదురుగా భారత్ కూడా తన దళాలను మోహరించింది. సరిహద్దుల్లో నియంత్రణ రేఖను దాటి తమ భూభాగంలోకి చొచ్చుకొస్తుందని చైనా ఆరోపించగా.. దీనిని భారత్ తిప్పికొట్టింది. వాస్తవానికి భారత సైన్యం సాధారణ పెట్రోలింగ్‌ను చైనా బలగాలే అడ్డుకుంటున్నాయని విదేశాంగ శాఖ బదులిచ్చింది. సరిహద్దు విషయంలో ఎంత బాధ్యతగా వ్యవహరించాలో తమకు తెలుసని, భారత సౌర్యభౌమాధికారం, భద్రతకు బలంగా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. సిక్కిం వెంబడి ఉన్న సరిహద్దును దాటి భారత బలగాలు తమ భూభాగంలో చొచ్చుకొచ్చాయంటూ చైనా చేసిన ఆరోపణలను విదేశాంగ శాఖ ఖండించింది.


By May 24, 2020 at 08:36AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-moves-more-troops-to-bolster-frontline-in-east-ladakh-at-sino-india-border/articleshow/75933585.cms

No comments