Breaking News

చత్తీస్‌గఢ్: సీనియర్‌పై అసిస్టెంట్‌ కమాండర్‌ కాల్పులు.. ఇద్దరు మృతి


ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌కు చెందిన అసిస్టెంట్ కమాండర్ సీనియర్ అధికారిపై కాల్పులు జరిపి ఇద్దరు ప్రాణాలను తీసిన దారుణ ఘటన చత్తీస్‌గఢ్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. నారాయణ్‌పూర్‌ జిల్లాలో చత్తీస్‌గఢ్ ఆర్మ్‌డ్‌ ఫోర్స్ కమాండర్‌పై అసిస్టెంట్‌ కమాండర్‌ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు కమాండర్లు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. 9వ బెటాలియన్‌కు చెందిన అసిస్టెంట్‌ ప్లాటూన్‌ కమాండర్‌ ఘనశ్యామ్‌ కుమేటి తన ఏకే 47తో కాల్పులు జరిపినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. గాయపడిన కమాండర్‌ను లచ్రామ్‌ ప్రేమిగా గుర్తించారు. ప్రేమి శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నారాయణ్‌పూర్‌ జిల్లా అమ్‌దాయి ఘాటీ క్యాంపులో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, గతేడాది డిసెంబరులోనూ నారాయణ్‌పూర్ జిల్లాల్లోనే ఉన్నతాధికారులు సెలవు ఇవ్వలేదన్న కోపంతో విచక్షణ కోల్పోయిన ఓ ఐటీబీపీ జవాను.. తన సహచరులపై కాల్పులు జరిపిన ఘటనలో ఐదుగురు జవాన్లు అక్కడికక్కడే మృతిచెందారు. ఆ తర్వాత నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కడెనార్ అటవీ ప్రాంతంలోని ఐటీబీపీ క్యాంపులో రెహమాన్ అనే జవాన్ తన సహచరులైన ఏడుగురు జవాన్లపై కాల్పులు జరిపాడు. అనంతరం రెహమాన్ తుపాకీతో కాల్పుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన మహేంద్రసింగ్, బెంగాల్‌కు చెందిన సుర్జీత్ సర్కార్, బిశ్వరూప్ మహతో, పంజాబ్‌కు చెందిన దల్జీత్‌సింగ్, కేరళకు చెందిన బిజేష్ అక్కడికక్కడే మృతిచెందారు.


By May 30, 2020 at 11:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/chhattisgarh-armed-forces-asst-commander-opened-fire-on-platoon-commanders-two-dies/articleshow/76103509.cms

No comments