Breaking News

నేటి సాయంత్రం తీరం దాటనున్న సూపర్ సైక్లోన్‌.. ఆ రాష్ట్రాలకు రెడ్ మెసేజ్ జారీ


బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్‌ తుఫాను సూపర్ సైక్లోన్‌గానే కొనసాగుతోంది. గడచిన 6 గంటల నుంచి గంటకు 11 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న అంపన్.. ఒడిశాలోని పరాదీప్‌కి దక్షిణంగా 180 కిలోమీటర్లు, పశ్చిమ్ బెంగాల్‌లోని దిఘాకు నైరుతిగా 320 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరాకు దక్షిణ-నైరుతిగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం మధ్య దిఘా-హతియా దీవుల సమీపంలో తుఫాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సుందర్బన్ మడ అడవుల సమీపంలో అంపన్ తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తీరం దాటే సమయమానికి సూపర్ సైక్లోన్ నుంచి అత్యంత తీవ్ర తుఫానుగా బలహీనపడుతుందని, ఈ సమయంలో తీరం వెంబడి గంటకు 155 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని హెచ్చరించింది. అంతేకాదు, పశ్చిమ్ బెంగాల్, ఒడిశాలకు రెడ్ మెసేజ్ జారీచేసింది. బుధవారం ఒడిశా ఉత్తర కోస్తాలోని బాలాసోర్, భద్రక్, మయూర్‌భంజ్, జైపూర్, కేంద్రపరా, కెంఝోర్‌గఢ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం గుండా పశ్చిమ బెంగాల్‌, ఒడిశా తీరాలవైపు వేగంగా కదులుతున్నట్టు ఐఎండీ తెలిపింది. తుపాను ప్రభావంతో బుధవారం, గురువారాలు పశ్చిమ బెంగాల్‌‌లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పశ్చిమ్ బెంగాల్‌లోని గంగాతీరం వెంబడి ఉన్న తూర్పు, పశ్చిమ మేదీనీపూర్, దక్షిణ, ఉత్తర 24 పరగణాస్, హౌరా, హుగ్లీ, కోల్‌కతా సమీపంలో జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తుందని ఐఎండీ అప్రమత్తం చేసింది. ఇదిలా ఉండగా.. పశ్చిమబెంగాల్‌లో ఇప్పటికే 3 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించగా, మొత్తం 14 లక్షల మందిని తరలించాల్సి ఉన్నట్లు భావిస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. అంపన్‌ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా తీరప్రాంత మండలాల్లో గాలుల ఉధృతి ఎక్కువగా ఉంది. సముద్రంలో అలల తీవ్రత పెరిగింది. సోంపేటలోని బారువతీరంతో పాటు పలుచోట్ల సముద్రం 300 అడుగుల ముందుకు వచ్చింది. హిరమండలంలోని వంశధారలో వరదనీటి ప్రవాహం పెరగడంతో గొట్టాబ్యారేజీ 7 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. ఉత్తరాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణకోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రెండు దశాబ్దాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన రెండో అతిపెద్ద సూపర్‌ సైక్లోన్‌గా అంపన్‌ను నిపుణులు అభివర్ణిస్తున్నారు. పెనుతుపాను వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంది. గంటకు 210 నుంచి 240 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. ఏపీలోని సముద్ర తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.


By May 20, 2020 at 07:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cyclone-amphan-set-to-hit-bengal-today-after-noon-to-evening-hours/articleshow/75838051.cms

No comments