కరోనా వైరస్ లైవ్ అప్డేట్స్: ఒకే పేరుతో ఇద్దరు.. పాజిటివ్ వ్యక్తిని డిశ్చార్జ్ చేసిన వైనం


⍟ కరోనా మహమ్మారితో అల్లాడుతున్న ప్రపంచ దేశాలకు ఆదివారం కొంతమేర స్వాంతన లభించింది. అంతకు రోజులతో పోలిస్తే పరిస్థితి కాస్త కుదుటపడింది. కరోనా ప్రాణనష్టం కూడా కాస్త తగ్గుముఖం పట్టింది. ఆదివారం ప్రపంచవ్యాప్తంగా 5,000 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 165,000 దాటింది. అటు అగ్రరాజ్యం అమెరికాలోనూ కరోనా మరణాలు తక్కువగానే నమోదయ్యాయి. ⍟ కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని పొరపాటున డిశ్ఛార్జ్ చేసిన ఘటన గుంటూరులో శనివారం చోటుచేసుకుంది. గుంటూరులోని కాటూరి వైద్య కళాశాల క్వారంటైన్ కేంద్రంలో ఇద్దరు కరోనా అనుమానితులు ఉన్నారు. వారిద్దరి పేర్లూ ఒకటే కాగా.. కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా, వారిలో ఒకరికి నెగెటివ్ వచ్చింది. అయితే సిబ్బంది పొరపాటున తాడేపల్లికి చెందిన వ్యక్తికి నెగెటివ్ వచ్చినట్లుగా ధ్రువపత్రంతో పాటు రూ.2వేల నగదు అందజేసి శనివారం రాత్రి అతడిని ఇంటికి పంపారు. కానీ ఆ నివేదిక అదే పేరుతో ఉన్న మరో వ్యక్తిది. జరిగిన పొరపాటును ఆదివారం ఉదయం గుర్తించిన అధికారులు తాడేపల్లి చేరుకుని పాజిటివ్ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఈ సంఘటన వెలుగుచూసింది. ⍟ దేశంలో మహమ్మారి రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ఆదివారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు 10 శాతం కంటే ఎక్కువ నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 552, గుజరాత్లో 367, ఉత్తరప్రదేశ్లో 179 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 17,325కు చేరుకుంది. దేశంలో గత 24 గంటల్లో 1,612 కేసులు నమోదు కాగా.. ఒక్క రోజులో ఇంత పెద్ద సంఖ్యలో నమోదు కావడం ఇదే తొలిసారి. ⍟ ప్రజల ప్రాణాలను కాపాడుకుంటేనే ప్రగతి రథాన్ని పట్టాలెక్కించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన లాక్డౌన్ మినహాయింపులు సోమవారం నుంచి అమల్లోకి వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ దాని అనుబంధ రంగాలు... మార్కెటింగ్, ఆహారశుద్ధి పరిశ్రమల కార్యకలాపాలను పూర్తిస్థాయిలో ప్రారంభానికి కేంద్రం అనుమతించింది. వీటితోపాటు మునిసిపల్ పరిధి బయట ఉన్న ప్రాంతాల్లోని పరిశ్రమల్లో కార్యకలాపాలకు పచ్చజెండా ఊపింది. ⍟ ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12 నుంచి ఆదివారం ఉదయం 11 గంటల వరకు కొత్తగా 44 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. ⍟ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్నవేళ.. దీనికి అడ్డుకట్ట వేయడానికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వైరస్ నివారణకు ఉపకరించే వ్యాక్సిన్పై అన్ని దేశాలు సన్నాహకాలు చేస్తున్నాయి. మరోవైపు ఇండియాలోనూ వ్యాక్సిన్ అభివృద్ధి కోసం తాజాగా టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశారు. ⍟ ప్రమాదకర కరోనా వైరస్ కారణంగా మహారాష్ట్ర అల్లాడుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఆ రాష్ట్రంలో పెద్దయెత్తున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 552 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో ఒక్కరోజు నమోదైన కేసుల్లో అత్యధికం ఈ రోజే కావడం గమనార్హం. ⍟ కరోనా వైరస్ దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్లోని ఒక ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన ప్రకటన వివాదస్పదమైంది. ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకుని రూపొందించిన ఈ ప్రకటనపై పోలీసులు కేసు కూడా బుక్ చేశారు. కేన్సర్కు ట్రీట్మెంట్ అందించే ఈ ఆస్పత్రి వర్గాలు.. ముస్లింలపై వివక్ష కనబర్చేలా ఈ యాడ్ను రూపొందించాయి. ⍟ గచ్చిబౌలిలో ఉన్న క్రీడా భవనాన్ని పూర్తిగా అగ్ర స్థాయి ఆస్పత్రిగా మార్చనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీని పేరు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ( ) అని పెట్టనున్నట్లు వివరించారు. తెలంగాణలో ఒక ప్రతిష్ఠాత్మక సంస్థగా దీన్ని మార్చుతామని చెప్పారు. ⍟ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం ప్రకటించారు. కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ను పొడిగించారు. తెలంగాణలో మే 7 వరకు లాక్డౌన్ కొనసాగుతుందని తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి కొన్ని సడలింపులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. కానీ, తెలంగాణలో ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు. ⍟ తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మాది ప్రతాపం కొనసాగుతూనే ఉంది. ఆదివారం ఒక్కరోజే తెలంగాణలో 18 కొత్త కరోనా కేసులు నమోదైనట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటి వరకూ కరోనా సోకడం వల్ల 21 మంది చనిపోయినట్లు వెల్లడించారు.
By April 20, 2020 at 09:10AM
No comments