Breaking News

లాక్‌డౌన్ పొడిగింపుతో ఎయిర్‌లైన్స్ షాక్.. ప్రయాణికులు రిఫండ్ ఇవ్వబోమని ప్రకటన!


కరోనా వైరస్‌ను కట్టడిచేయడానికి దేశవ్యాప్తంగా తొలి విడతలో విధించిన ఏప్రిల్ 14తో ముగుస్తుందని, ఆ తర్వాత ప్రయాణాలకు అనుమతిస్తారని భావించారు. ఈ నేపథ్యంలో కొందరు ముందస్తు ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుని, రైలు, విమాన టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. అయితే, వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకు బుకింగ్‌లను విమానయాన సంస్థలు రద్దుచేసే పనిలో ఉన్నాయి. అయితే, టికెట్లను రద్దు చేసినా, డబ్బులు మాత్రం వాపసు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నాయి. ఆ నగదును తమ వద్దే (క్రెడిట్‌ షెల్‌) ఉంచుకుంటామని, తదుపరి ప్రయాణాలకు వాటిని ప్రయాణికులు వాడుకోవచ్చని చెబుతున్నాయి. అంతేకాదు, నగదు వినియోగంపై కొన్ని ఏడాది చివరకు, మరికొన్ని ఏడాదికాలం వరకు కాలపరిమితితో బుకింగ్‌లకు అవకాశం కల్పిస్తున్నాయి. ఒక్క ఎయిరిండియా తప్ప అన్ని విమానయాన సంస్థలు ఏప్రిల్ 14 తర్వాత ప్రయాణాలకు బుకింగ్‌లు ప్రారంభించాయి. లాక్‌డౌన్ మే 3 వరకు ప్రధాని పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో.. దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను అంత వరకూ నిలిపివేస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. మే 3 వరకు ప్రయాణాల కోసం బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేస్తున్నట్టు స్పైస్‌జెట్ ప్రకటించింది. అయితే, టికెట్లు రద్దు చేశాక నగదు తమ వద్దే అట్టిపెట్టుకుని 2021 ఫిబ్రవరి 28 వరకు అదే ప్రయాణికుడు ఎప్పుడు కొత్తగా బుకింగ్‌ చేసుకోవాలనుకున్నా ఆ డబ్బులను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. తాము కూడా మే 3 వరకు అన్ని విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్టు ఇండిగో తెలిపింది. టికెట్ల బుకింగ్‌ రద్దు ప్రక్రియ కొనసాగుతోందని,. పీఎన్‌ఆర్‌ రూపంలో మీ టికెటు డబ్బులు సురక్షితంగానే ఉంటాయని స్పష్టం చేసింది. టికెటు తేదీ నుంచి ఏడాదిలోపు ఆ డబ్బులను ఎప్పుడైనా తదుపరి ప్రయాణం కోసం వాడుకోవచ్చని తెలియజేసింది. మే 3వ తేదీ వరకు ప్రయాణాల కోసం కొనుగోలు చేసిన టికెట్లను రద్దు చేసి, బదులుగా 2020 డిసెంబరు 31 వరకు ఎప్పుడైనా టికెట్‌ను బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని విస్తారా ప్రకటించింది. ఒకవేళ అప్పుడు ఛార్జీలో ఏమైనా తేడా ఉంటే ఆ మొత్తాన్ని ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుందని విస్తారా అధికారి ప్రతినిధి తెలిపారు. ‘ప్రొటెక్ట్‌ యువర్‌ పీఎన్‌ఆర్‌’ పథకం 2020 ఏప్రిల్ 30 వరకు వర్తిస్తుందని గోఎయిర్ తెలిపింది. ఈ పథకానికి అర్హత పొందిన వినియోగదార్లకు వచ్చే ఏడాది మే 3 వరకు ఎలాంటి రుసుం చెల్లించకుండానే ప్రయాణాన్ని మరో తేదీకి మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేతపై ఎలాంటి స్పష్టత లేకుండా విమానయాన సంస్థలు ఏప్రిల్ 14 నుంచి ముందస్తు టిక్కెట్లు బుకింగ్ ప్రారంభించడం సమంజసం కాదని ఆసియా పసిఫిక్ ఏవియేషన్ కన్సల్టెన్సీ సెంటర్ గతవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, జెట్ ఎయిర్‌వేస్ ఉందతాలను ఉదాహరణలుగా పేర్కొంది. ఈ రెండు సంస్థలు నష్టాలతో మూతపడటంతో ఇప్పటికే ప్రయాణీకులకు భారీ నష్టం కలిగిందని, రిఫండ్ సొమ్ము వాపసు చేయకపోవడంతో వారు కోట్లాది రూపాయలు నష్టపోతారని పేర్కొంది.


By April 15, 2020 at 09:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/extending-the-lockdown-to-may-3-airlines-decline-refund-to-customers-for-cancelled-tickets/articleshow/75151922.cms

No comments