Breaking News

పుల్వామాలో భీకర ఎదురు కాల్పులు.. ముగ్గురు ముష్కరులు హతం


కశ్మీర్‌లో మరోసారి భద్రత దళాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా త్రాల్‌ సెక్టార్‌ దైవర్ గ్రామంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. దైవర్ గ్రామంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో భద్రతాబలగాలు అక్కడకు చేరుకుని నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. మంగళవారం రాత్రి నిర్వహించిన ఈ తనిఖీల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన ప్రత్యేక ఆపరేషన్ విభాగం రాష్ట్రీయ రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, జమ్మూ కశ్మీర్ పోలీస్ విభాగం సంయుక్తంగా పాల్గొన్నాయి. భద్రతా దళాల రాకను గమనించిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన సైన్యం వారిపై ఎదురు కాల్పులు జరిపింది. ఇరు వర్గాలు మధ్య భీకర కాల్పులు అనంతరం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కశ్మీర్ పోలీస్ విభాగానికి చెందిన ఐజీ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరిని స్థానిక ఉగ్రవాదులుగా భావిస్తున్నామని, ఘటనా స్థలిలో భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. వీరి వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారేమో అనే అనుమానంతో తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఫిబ్రవరి 5న శ్రీనగర్ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ జవాను ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. లవాయ్‌పొర ప్రాంతంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు తెగబడటంతో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. అంతకు ముందు జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద ఓ ట్రక్కులో వచ్చిన ముష్కరులను సైన్యం గుర్తించడంతో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.


By February 19, 2020 at 08:28AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/three-militants-killed-in-encounter-with-forces-in-pulwana-in-jammu-and-kashmir/articleshow/74201235.cms

No comments