Breaking News

పెరుగుతున్న కోవిడ్ మృతులు: మరిన్ని ఆంక్షలు.. ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిషేధం


హుబే ప్రావిన్సుల్లో మరింత తీవ్రరూపం దాల్చడంతో చైనా మరిన్ని ఆంక్షలను విధించింది. ఇప్పటికే ప్రజా రవాణాను నిలిపివేసి, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లను మూసివేసిన విషయం తెలిసిందే. తాజాగా, హుబెయ్‌ ప్రావిన్సులోని ప్రజలు ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్లవద్దని ప్రభుత్వం ఆదేశించింది. ప్రైవేటు వాహనాల వినియోగాన్ని నిషేధించిన ప్రభుత్వం.. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశించింది. అంతేకాదు, మూడు రోజులకోసారి ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరు చొప్పున బయటకు వచ్చి ఆహారం, నిత్యావసరాలు కొనుగోలు చేసుకోవాలని తెలిపింది. హుబే ప్రావిన్సుల్లోని కనీసం 10 నగరాల్లో జలుబు, జ్వరం మందుల అమ్మకాన్ని నిషేధించారు. అలాంటి లక్షణాలు ఉన్నవారు తక్షణమే హాస్పిటల్‌లో చేరాలని సూచించారు. హుబే ప్రావిన్సుల్లోని ప్రజలు ఎవరూ బయటకు వెళ్లరాదని, బయట ప్రాంతాల వారు కూడా ఇక్కడకు రావద్దని ఆదివారం ఓ ప్రకటన వెలువరించింది. సోమవారం నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అత్యవసరం కాని వాహనాలు నిషేధించి, అవసరంలేని బహిరంగ ప్రదేశాలను మూసివేస్తున్నట్టు అందులో వివరించింది. నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. మరోవైపు, కొవిడ్‌తో మృతి చెందినవారి సంఖ్య 1,770కి చేరినట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. ఆదివారం 100కిపైగా మరణాలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. అలాగే కొత్తగా మరో 2 వేల మందికి వైరస్ సోకినట్టు తెలియజేసింది. దీంతో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 70,500కి చేరింది. ఒక్క హుబే ప్రావిన్సుల్లోనే కొత్తగా 1,933 మంది వైరస్ బారినపడ్డారు. వైరస్ బారినపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రోగులు క్రమంగా కోలుకుంటున్నారని, పరిస్థితి విషమంగా ఉన్నవారి శాతం గణనీయంగా తగ్గిందని తెలిపింది. ఇప్పటి వరకు హుబే ప్రావిన్సుల్లో 58,182 మందికి వైరస్ సోకగా, 6,639 మంది కోలుకున్నారని, 1,696 మృతిచెందారని అధికారులు వెల్లడించారు. గడిచిన నాలుగు రోజుల నుంచి కొత్తగా వైరస్ సోకినవారి సంఖ్య తగ్గుతూ ఉంది. అలాగే హుబే ప్రావిన్సుల వెలుపల గత 12 రోజుల నుంచి బాధితుల సంఖ్య తగ్గుతోందని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ బాధితులను నాలుగు వర్గాలు విభజించారు. కరోనా వైరస్ ధ్రువీకరించినవారు, అనుమానిత రోగులు, బంధువులకు కరోనా లక్షణాలు, జ్వరంతో బాధపడుతున్నరోగులు వీరందరికీ సకాలంలో చికిత్స చేయించడం లేదా నిర్బంధంలో ఉంచడం చేయాలని సూచించింది. కాగా, చైనా ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని, త్వరలోనే ఔషధాలను పంపనున్నట్టు భారత్‌ తెలిపింది. చైనాకు వైద్య పరికరాల ఎగుమతిపై ఉన్న ఆంక్షల్ని భారత్ ఎత్తివేసింది. జపాన్‌ తీరంలో నిలిచిపోయిన విహార నౌక డైమండ్ ప్రిన్సెస్‌లోని మరో ఇద్దరు భారతీయులకు కరోనా వైరస్‌ ఉన్నట్లు తేలింది. తైవాన్‌లో తొలి కొవిడ్‌-19 మరణం నమోదైంది. ఓ టాక్సీ డ్రైవర్‌ ఈ వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.


By February 17, 2020 at 08:16AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/chinas-hubei-with-60-million-people-under-lock-down-as-coronavirus-death-toll-mounts/articleshow/74167343.cms

No comments