ఫడ్నవీస్కు మెజార్టీ ఉందా.. బలనిరూపణ అసెంబ్లీలో మాత్రమే జరగాలి: సుప్రీం

మహారాష్ట్ర అంశంపై సోమవారం సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫడ్నవీస్కు మెజార్టీ ఉంటే 24 గంటల్లోగా బలం నిరూపించుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ భూషణ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. మెజార్టీని రాజ్భవన్ నిర్ణయించలేదని, అసెంబ్లీలో మాత్రమే జరగాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఫిరాయింపులను నిరోధించాలంటే తక్షణమే బలపరీక్షను నిర్వహించాలని కోరింది. ఫడ్నవీస్కు మెజార్టీ ఉందా, గతంలో 24 గంటల్లోనే బలపరీక్ష నిర్వహించిన సందర్భాలున్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. కోర్టుకు ఇచ్చిన మద్దతు లేఖలు మరాఠాలో ఉన్నాయని, వాటిని అనువాదం చేయాలని ఆదేశించారు. తొలుత ఆదివారం నాటి ఆదేశాల ప్రకారం.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకున్నారో చెప్పే లేఖలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనకు మెజార్టీ ఉందని సీఎం ఫడ్నవీస్ సమర్పించిన లేఖ, ఎన్సీపీ ఎమ్మెల్యేల సంతకాలతో శాసనసభాపక్ష నేత హోదాలో అజిత్ పవార్ సమర్పించిన లేఖను సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం సరైన నిర్ణయమేనని, ఈ లేఖలపై లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఆయనకు లేదని సొలిసిటర్ జనరల్ అన్నారు. గవర్నర్ నిర్ణయంపై న్యాయసమీక్షాధికారం పరిధిని ఈ సందర్భంగా తుషార్ మెహతా ప్రశ్నించారు. ఫడ్నవీస్-పవార్ ప్రభుత్వానికి 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్ లేఖను చదివి వినిపించారు. నవంబరు 22న అజిత్ పవార్ మద్దతు లేఖ అందజేశారని, వీటిని నమ్మకపోవడానికి గవర్నర్ వద్ద ఎలాంటి కారణాలు లేవని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదని, మెజార్టీ సీట్లున్న పార్టీనే ఆహ్వానించారని స్పష్టం చేశారు. కోర్టులు బలపరీక్షకు ఆదేశించలేవని ఆయన వాదించారు. తరఫున వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ.. మద్దతు లేఖలు ఆధారంగా గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఆయన నిర్ణయాన్ని తప్పుబట్టలేమని వాదించిన ముకుల్ రోహత్గీ.. 24 గంటల్లోగా బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించే అధికారం కోర్టుకు లేదని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల ముందు బీజేపీతో ఉన్న శివసేన తప్పుకోవడం వల్లే రాష్ట్రపతి పాలన విధించారని, ఆ తర్వాత మద్దతు ఇచ్చేందుకు అజిత్ పవార్ ముందుకొచ్చారని అన్నారు. ఒక పవార్ మా వైపు... మరో పవార్ వారివైపు ఉన్నారు... వారి మధ్య ఉన్న కుటుంబ కలహాలతో తమకు సంబంధం లేదని వాదించారు. బీజేపీకి మద్దతిస్తున్నట్లు అజిత్ పవార్ 54 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను సమర్పించారన్నారు. దాని ఆధారంగానే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని తెలిపారు. సంతకాలు ఫోర్జరీ చేశారని ఎన్సీపీ నేతలు చెప్పట్లేదని, బలపరీక్షకు సమయం ఇవ్వడం అనే గవర్నర్ విచక్షణాధికారాన్ని ఎలా ప్రశ్నిస్తారన్నారు. ఇంత సమయంలోనే బలపరీక్షకు ఆదేశించాలని కోర్టు చెబుతుందా? గవర్నర్ నిర్ణయం న్యాయసమీక్ష పరిధిలోకి రాదు అని రోహత్గీ వాదించారు.
By November 25, 2019 at 11:41AM
No comments