పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై ఆర్మీ మెరుపు దాడులు
సరిహద్దుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో సైన్యం మరింత అప్రమత్తమయ్యింది. పాకిస్థాన్ సైన్యం సాయంతో దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేస్తున్న ప్రయత్నాలను సైన్యం తిప్పికొడుతోంది. తాజాగా, పాక్ ఆక్రమిత కశ్మీర్లో చొరబాటుకు సిద్ధంగా ఉన్న ఉగ్రవాదులే లక్ష్యంగా విరుచుకుపడింది. ఆదివారం ఉదయం పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేసింది. ఆర్టిలరీ తుపాకులతో ఉగ్రవాద శిబిరాలపై దాడిచేసింది. వాస్తవాధీనరేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోన్న పాక్.. కశ్మీర్కు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత మరిన్ని దురాగతాలకు పాల్పడుతోంది. వారం రోజుల వ్యవధిలో పాక్ సైన్యం బరితెగింపుల వల్ల నలుగురు సైనికులు అమరులయ్యారు. ఆదివారం ఉదయం కశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపేందుకు పాక్ సైన్యం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. కుప్వారా జిల్లా తంఘధర్ సెక్టార్లో భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు, ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. పాక్ కవ్వింపు చర్యలను సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. ఇందులో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బుల్లెట్ల వర్షం కురిపించింది. భారత సైన్యం కాల్పుల్లో పాకిస్థాన్వైపు కూడా భారీ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. వారం రోజుల కిందట నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు ఎటువంటి హెచ్చరికలు లేకుండా కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనిని భారత దళాలు ధీటుగా తిప్పికొట్టాయి. బారాముల్లా, ఉరి సెక్టర్లో భారత స్థావరాలపై పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాను తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని రద్దుచేసిన తర్వాత పాక్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలను ముమ్మరం చేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 2050సార్లు పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
By October 20, 2019 at 12:15PM
No comments