Breaking News

గోదావరి బోటు వెలికితీత.. తొలి రోజు నిరాశ.. నేడు ఇలా..


తూర్పు జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిన బోటును బయటికి తీయడానికి సోమవారం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ధర్మాడి సత్యం నాయకత్వంలోని 25 మంది బృందం బోటు కోసం గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. తొలి రోజు వీరి అనేష్వణ ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో మంగళవారం గాలింపు చర్యలను ప్రారంభించనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోటు, పంటుతోపాటు స్థానికులకు చెందిన ఏడు బోట్లను గాలింపు కోసం వాడుతున్నారు. ధర్మాడి సత్యం బృందం బోటు వెలికి తీస్తుందేమోననే ఆశతో సోమవారం కచ్చలూరులో బోటును మునిగిన ప్రాంతానికి భారీ సంఖ్యలో జనం చేరుకున్నారు. అంతకుముందు బోటు వెలికి తీయడానికి నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు ప్రయత్నించినప్పటికీ.. ఫలితం దక్కలేదు. దీంతో ధర్మాడి సత్యాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. బోటు వెలికితీత కోసం ప్రభుత్వం రూ.23 లక్షలు కేటాయించింది. సోమవారం రంగంలోకి దిగిన ఆయన లాంచీ ఎర్రమట్టి బురదలో చిక్కుకుని ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ధర్మాడి సత్యం టీం భారీ ఇనుప కొక్కేలు, ఇనుప తాళ్లను పంటు ద్వారా గోదావరిలోకి వదిలింది. దాన్ని గోదావరి ఒడ్డున ఉంచిన జేసీబీలకు కట్టారు. పంటు ద్వారా నదీ గర్భంలోకి లోపలికి లంగర్లను దించి.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాలింపు చర్యలు ప్రారంభించారు. లంగర్లకు లాంచీ చిక్కుకునేంత వరకు అన్వేషణ కొనసాగనుంది. ఆ తర్వాత లోతును బట్టి ఏం చేయాలనేది నిర్ణయిస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. పాపికొండలు విహారయాత్రకు 77 మందితో బయల్దేరిన బోటు సెప్టెంబర్ 15న కచ్చలూరు ప్రాంతంలో బోల్తా పడగా.. 15 మంది ఆచూకీ ఇప్పటికీ దొరకని సంగతి తెలిసిందే.


By October 01, 2019 at 08:12AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/dharmadi-satyam-and-team-trying-to-find-the-boat-which-was-capsized-in-godavari/articleshow/71384493.cms

No comments