Breaking News

YSR: జనం గుండెల్లో సంక్షేమ శ్రామికుడు.. మహానేత వైఎస్సార్


సంక్షేమ పథకాలు అంటే గుర్తుకొచ్చేది ఆయన. బడుగు బలహీన వర్గాలకు గూడునిచ్చి (ఇందిరమ్మ ఇళ్లు), ఫించనుతో వారికి ఆకలి తీర్చాడు. ఆరోగ్యశ్రీతో ఎందరికో పునర్జమ్మ అందించాడు. ప్రజల హితం కోరిన మహానేత అయ్యారు. చెదరని చిరునవ్వుతో ప్రతి పేదవాడిని పలకరించే రాజన్న.. కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలను శోక సంద్రంలో ముంచుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి తొమ్మిదేళ్లు గడిచిపోయాయి. నేడు (సెప్టెంబర్ 2) దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పదవ వర్ధంతి. ఈ సందర్భంగా రాజన్నకు నివాళిగా ఈ కథనం.. తాను ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి ఎంతో నిజాయతీగా, నిబద్ధతతో కృషి చేసిన వ్యక్తి . పేద ప్రజలకు కార్పోరేట్ వైద్యం కల అనుకుంటే.. దాన్ని సైతం ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి వారి కలను నిజం చేశారు. ఉన్నత చదువులు కొనలేమని భావించిన సరస్వతీ పుత్రులకు ఫీజు రీయింబర్స్ మెంట్ వరం కల్పించిన ఘనుడు వైఎస్సార్. నిరుపేద ముస్లిం యువతకు విద్యా ఉద్యోగావకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం. పండుటాకులకు పింఛను ఇచ్చి వారి ఆకలి తీర్చారు. తినే అన్నం మెతుకుల్లో, ఆయన కట్టించిన ఇందిరమ్మ ఇళ్లలోనూ, తమకు పునర్జన్మ ప్రసాదించిన రాజశేఖరుడిని తలుచుకుని నేటికీ కన్నీళ్లు పెడుతున్నారు. జనం కష్టసుఖాలను తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో రైతుల కష్టాలు చూసి చలించిపోయారు. దేశానికి వెన్నెముక వ్యవసాయమేనని బలంగా విశ్వసించి సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతూ జలయజ్ఞం ఆరంభించారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు అండగా నిలిచారు. రైతు రుణాలు మాఫీ చేసి లక్షల రైతు కుటుంబాల్లో వెలుగులు నింపారు. పాదయాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో విజయం సాదధించి 2004 మే నెలలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్.. రూ.2కే కిలో బియ్యం, రైతులకు ఉచిత విద్యుత్, 108 (అంబులెన్స్ సర్వీసులు), ట్రిపుల్‌ ఐటీల ఏర్పాటు సహా ఎన్నో ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అసలు ఆరోజు ఏం జరిగింది.. 2009 సెప్టెంబర్ 2.. ఉమ్మడి ఏపీలో వర్షాలు కురుస్తున్న సమయం అది. క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకున్నాయని, ఇబ్బంది తలెత్తవచ్చని అధికారులు హెచ్చరించారు. అయితే ప్రజలు సమస్యలు తెలుసుకోవడమే తనకు ముఖ్యమంటూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రచ్చబండ’ కార్యక్రమానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హెలికాప్టర్‌లో బయలుదేరారు. ఉదయం 9.35 గంటలకు హెలికాప్టరు నుంచి సమాచారం కట్ అయింది. అసలేమైందంటూ అధికారులు, పోలీసులు హెలికాప్టర్ కోసం గాలింపు మొదలుపెట్టారు. దాదాపు 12 గంటల తర్వాత వైఎస్సార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు అధికారులు చెప్పగానే ఆయన అభిమానుల గుండెల్లో వేగం పెరిగింది. దాదాపు ఒకరోజు గడిచాక హెలికాప్టర్ కర్నూలుకు 40 కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవుల్లోని పావులరాళ్ల గుట్ట వద్ద కూలిపోయినట్లు ప్రకటన. ప్రమాదస్థలం కర్నూలు-ప్రకాశం జిల్లా సరిహద్దులో ఆత్మకూరు - వెలుగోడుకు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతానికి చేరుకున్న అధికారులు, సిబ్బంది ప్రమాదంలో వైఎస్సార్‌తో పాటు మొత్తం ఐదుగురు మరణించారని ప్రకటించారు. తమ ఆరాధ్యనేత మరణాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో 60 మందికి పైగా గుండెలు ఆగిపోయాయి. మరికొందరు అభిమానులు ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. తమ ఇళ్లల్లో ఫొటో పెట్టుకుని దేవుడిగా పూజిస్తున్న అభిమానులు వైఎస్సార్ సొంతం.


By September 02, 2019 at 08:18AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/tribute-paid-to-former-ap-cm-ys-rajasekhara-reddy-on-his-10th-death-anniversary/articleshow/70941618.cms

No comments