Breaking News

ఆర్థిక మాంద్యం దిశగా దేశం.. మోదీపై మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు!


దేశ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలను తూర్పారబట్టారు. స్థూల దేశీయోత్పత్తి 5 శాతానికి పడిపోవడం చూస్తే మందగమన ప్రభావం కనిపిస్తోందని.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి మోదీ ప్రభుత్వ నిర్వాకమే కారణమని దుయ్యబట్టారు. వృద్ధి రేటు వేగంగా ఉన్నా మోదీ ప్రభుత్వ అసమర్థ నిర్వహణ వల్లే ఈ దుస్థితి తలెత్తిందని మన్మోహన్ ధ్వజమెత్తారు. ముఖ్యంగా ఉత్పాదక రంగం 0.6 శాతానికి పడిపోవడం తీవ్ర విచారం కలిగిస్తోందన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలులో లోపాల ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ ఆర్థిక విధానాలతో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని, ఒక్క ఆటోమొబైల్ రంగంలోనే 3.5 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారన్నారు. అసంఘటిత రంగంలోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అనేక మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని వ్యాఖ్యానించారు. దేశీయ వినిమయం తగ్గిపోయిందని, వినియోగ వృద్ధి రేటు 18 నెలల కనిష్ఠానికి పడిపోయిందని తెలిపారు. జీడీపీ పెరుగుదల తగ్గిపోయి ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 5 శాతానికి కనిష్ఠానికి పడిపోయిందన్నారు. ఉత్పాదక రంగం 0.6 శాతానికి చేరిందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదొడుకుల్ని ఎదుర్కొంటోందని, ఆదాయం గణనీయంగా పడిపోవడంతో రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాల్లోని కార్మికులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక మందగమనం దేశంలోని మొత్తం 50 శాతం మంది ప్రజలపై పెను ప్రభావం చూపిందని, వారి మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని అన్నారు. చట్టబద్ధ సంస్థల్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని మన్మోహన్‌ ఆరోపించారు. ప్రభుత్వానికి రూ.1.76 కోట్ల నిధుల్ని ఆర్బీఐ బదిలీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. పెట్టుబడిదారుల నమ్మకాలు ఊగిసలాటధోరణిలో ఉన్నాయని, ఇవి ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఏ మాత్రం సహకరించవని అన్నారు. బడ్జెట్‌ ప్రకటనలు, పథకాల అమలు తీరు విదేశీ మదుపర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని, భౌగోళిక రాజకీయాల కారణాలతో అంతర్జాతీయంగా పెరిగిన ఎగుమతుల అవకాశాల్ని ఒడిసిపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. యువత, రైతాంగం, ఔత్సాహక పారిశ్రామికవేత్తలు ఇలా అన్ని రంగాల వారికి ప్రభుత్వం ఇంకా ఎంతో చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం రాజకీయాల్ని పక్కనబెట్టి నిపుణులు, మేధావుల్ని సంప్రదించాలని సూచించారు. ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించాలంటే ఇంతకంటే మెరుగైన మార్గం లేదన్నారు. ఆర్థిక మందగమనం నుంచి బయటపడటానికి తీసుకునే చర్యలపై ఎలాంటి ప్రణాళిక లేవని స్పష్టమవుతోందని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే, ఫిట్ ఇండియా గురించి ప్రధాని మోదీ ఆందోళన చెందుతున్నారంటూ మరో నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటుందని, జీడీపీ పడిపోతోందని ప్రభుత్వమే చెబుతోందని, ఆర్బీఐ నుంచి డబ్బు తీసుకునే స్థాయికి చేరింది.. కానీ ఫిట్ ఇండియా గురించి ప్రధాని మోడీ ఆందోళన చెందుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఫిట్ ఇండియా అవసరమే కానీ, పోషకాహారలోపం, పేదరికం, ద్రవ్యోల్బణం, ఆర్థికస్థితి, నిరుద్యోగం లాంటి విషయాలపై చర్చించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.


By September 01, 2019 at 02:45PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-leader-ex-pm-manmohan-singh-slams-modi-govt-for-ongoing-economic-crisis/articleshow/70933410.cms

No comments