టీటీడీ అధికారుల తప్పిదం.. ఒకరికి బదులు మరొకరికి ఆహ్వానం, చివరకు..

పాలకమండలి సభ్యుల ప్రమాణం విషయంలో అధికారులు తప్పులో కాలేశారు. పేరుతో నియమితుడైన వ్యక్తి విషయంలో టీటీడీ అధికారులు తికమక పడ్డారు. ముంబైకి చెందిన రాజేశ్ శర్మను ఎంపిక చేయగా.. అధికారులు మాత్రం ఢిల్లీకి చెందిన రాజేశ్ శర్మ అనే వ్యక్తికి సమాచారం పంపారు. పాలక మండలి అజెండాతోపాటు ప్రమాణ స్వీకార పత్రాన్ని ఆయనకు పంపారు. అక్టోబర్ 3న ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించడానికి సిద్ధమయ్యారు. కానీ ముంబైకి చెందిన రాజేశ్ శర్మ తమను సంప్రదించడంతో టీటీడీ అధికారులు కన్ఫ్యూజన్కు గురయ్యారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా తననే నియమించారని ముంబైకి చెందిన రాజేశ్ శర్మ వారికి చెప్పారు. ఈ విషయమై ఆరా తీసిన అధికారులు పొరబాటున ఢిల్లీకి చెందిన రాజేశ్ శర్మకు సమాచారం ఇచ్చినట్టు గుర్తించారు. తప్పిదాన్ని సరిదిద్దుకొని ముంబైకి చెందిన వ్యక్తితో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ వ్యవహారంలో టీటీడీ చైర్మన్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి. ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 28 మందిని టీటీడీ పాలకమండలిలో సభ్యులుగా నియమించిన సంగతి తెలిసిందే.
By September 29, 2019 at 12:48PM
No comments