Breaking News

రక్షాబంధన్ రోజున విషాదం.. జేసీబీ ఢీకొని కుమార్తె సహా దంపతుల మృతి


రక్షా బంధన్ రోజున రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సోదరుడికి రాఖీ కట్టి ఇంటికి తిరిగివెళ్తున్న మహిళ భర్త, కుమార్తెతో కలిసి రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మొయినాబాద్ మండలం నక్కలపల్లి వద్ద గురువారం సాయంత్రం జరిగింది. కొత్తూరు మండలం సుభాన్‌పూర్ గ్రామానికి చెందిన పోచారం బాల్‌రెడ్డి (45), జ్యోతి (40) దంపతులు. వీరికి శిరీష్(12), సాయిచరణ్ సంతానం. రాఖీ పౌర్ణమి సందర్భంగా చేవెళ్లలో ఉంటున్న తన సోదరుడు శ్రీనివాస్‌రెడ్డికి రాఖీ కట్టేందుకు జ్యోతి గురువారం ఉదయం భర్త, పిల్లలతో కలిసి వెళ్లింది. అక్కడ కుటుంబసభ్యలతోఆనందంగా గడిపిన తర్వాత సాయంత్రం వేళ బైక్‌పై ఇంటికి బయలుదేరారు. చేవెళ్ల-శంషాబాద్ రహదారిపై నక్కపల్లి వద్ద అతివేగంతో వచ్చిన జేసీబీ వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాల్‌రెడ్డి, జ్యోతి, శిరీష తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సాయిచరణ్ జేసీబీ చక్రం కింద ఇరుక్కుని తీవ్రగాయాలపాలయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని సాయిచరణ్‌ను రక్షించారు. విగతజీవుగా పడివున్న తల్లిదండ్రులు, అక్కను చూసి బాలుడు కన్నీరుమున్నీరయ్యాడు. ఒక్క ప్రమాదంలో సాయిచరణ్ అనాథగా మారడంతో అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


By August 16, 2019 at 11:45AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/road-accident-in-rangareddy-district-jcb-hits-bike-3-died/articleshow/70696555.cms

No comments