Breaking News

‘ఆపరేషన్ కోరమండల్’.... వైజాగ్‌కు విమానంలో వచ్చి హంతకుడిని పట్టుకున్న పోలీసులు


తమిళనాడు రాజధాని చెన్నైలో రెండ్రోజుల క్రితం ఓ వ్యక్తిని హత్యచేసి పారిపోతున్న నిందితుడిని పోలీసులు సినీఫక్కీలో పట్టుకున్నారు. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో పారిపోతున్న అతడిని పట్టుకునేందుకు పోలీసులు చెన్నై నుంచి వైజాగ్‌కు విమానంలో చేరుకోవడం విశేషం. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసుల సాయంతో ఎట్టకేలకు అతడిని పట్టుకోవడంతో ‘ఆపరేషన్ కోరమండల్’ ముగిసింది. చెన్నైలో రెండ్రోజుల క్రితం ఓ ఏటీఎంలో చోరీకి పాల్పడిన దొంగ అదేరోజు ఓ వ్యక్తిని దోచుకుని హత్య చేశాడు. దీనిపై కేసు నమోదుచేసుకున్న చెన్నై పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడు చెన్నై నుంచి కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో పారిపోతున్నట్లు తెలుసుకున్న పోలీసులు వైజాగ్‌లోని ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులకు సమాచారమిచ్చి అప్రమత్తం చేశారు. కొందరు పోలీసులు చెన్నై నుంచి విమానంలో వైజాగ్ చేరుకున్నారు. రైలు వైజాగ్ రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే అన్ని విభాగాల పోలీసులు బోగీల్లోకి వెళ్లి జల్లెడ పట్టారు. ఓ రిజర్వేషన్ బోగీలో తలుపు దగ్గర నిలబడిన వ్యక్తి పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నారు. తాము వెతుకున్న నేరస్థుడు అతడేనని నిర్ధారించుకున్న పోలీసులు అరెస్ట్ చేసి చెన్నైకి తరలించారు.


By July 17, 2019 at 11:48AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/chennai-police-arrested-accused-of-murder-case-in-vizag-railway-station/articleshow/70256224.cms

No comments