Breaking News

నా కోరిక తీరింది.. అందుకే ఏడాదిన్నర తర్వాత తిరుమలకు: మోహన్‌బాబు


నటుడు మోహన్‌బాబు శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో బీజేపీ నేత, మాజీ ఎంపీ గాలి జనార్దన్ రెడ్డితో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా కోరిక ఫలించిందని, అది నేరవేరడంతో ఏడాదిన్నర తర్వాత శ్రీవారి దర్శనానికి వచ్చానని అన్నారు. ఆ కోరికేంటో శ్రీవారికి తెలుసని వివరించారు. స్వామివారి ఆశీస్సులతో తెలుగు ప్రజలందరి కోరికలు, ఆంకాంక్షలు తీరనున్నాయని వ్యాఖ్యానించారు. సీఎంగా జగన్ చక్కగా పని చేస్తున్నారని ఆయన కితాబిచ్చారు. ఆయన పాలన అన్ని వర్గాల ప్రజలకూ నచ్చుతుందని తాము భావిస్తున్నానని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని తాను కోరుకుంటున్నానని, జగన్ దాన్ని సాధిస్తారన్న నమ్మకం తనకుందని మోహన్ బాబు వెల్లడించారు. మంచి ముఖ్యమంత్రి, సమర్థ పాలనలో రాష్ట్రం బాగుంటుందని అన్నారు. జగన్ పాలనలో తిరుమల కూడా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మిజోరాం మాజీ గవర్నర్ వినోద్ కుమార్ దుగ్గల్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందే వైసీపీలోకి చేరిన నటుడు మోహన్‌బాబుకు ఒక దశలో టీటీడీ ఛైర్మన్ పదవి వరిస్తుందనే ప్రచారం సాగింది. అయితే, అవన్నీ ఒట్టి పుకార్లేనని, వాటి నమ్మొద్దని ఆయన తెలియజేశారు. తాజాగా, నామినేటెడ్ పదవులకు ఏపీ సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా మోహన్ బాబును నియమించనున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా తనను నియమించినట్లు వస్తున్న వార్తలను కూడా మోహన్ బాబు ఖండించారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా మోహన్‌బాబును నియమించారన్న వార్తల్లో నిజం లేదని, అలాంటిది ఏదైనా ఉంటే అధికారికంగా తెలియజేస్తామని ఆయన పీఆర్‌ టీం స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలను నమ్మవద్దని పేర్కొన్నారు.


By July 06, 2019 at 12:32PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/actor-mohan-babu-visit-tirumala-srivari-temple-after-one-and-half-year/articleshow/70102571.cms

No comments