Breaking News

చొరబాటుకు యత్నం.. పాక్ సైనికుడ్ని కాల్చిచంపిన భారత్ సైన్యం


సరిహద్దుల్లో తరుచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ దేశంలో విధ్వంసానికి ప్రయత్నిస్తున్న దాయాది పాకిస్థాన్.. మరోసారి కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మూల్యం చెల్లించుకుంది. జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కేరన్‌ సెక్టార్‌లోకి శనివారం అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన పాక్ సైనికుడిని భారత సైన్యం హతమార్చింది. అతడి దగ్గర నుంచి ఏకే-47 రైఫిల్‌, పెద్దఎత్తున తూటాలు, ఏడు గ్రనేడ్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ‘‘నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు విరమణ పాటించాలన్న ఒప్పందానికి పూర్తిగా తూట్లు పొడుస్తూ జనవరి 1న కుప్వారా జిల్లాలో చొరబాటు యత్నం లేదా బ్యాట్‌ చర్యకు (పాకిస్థాన్‌ సైన్యానికి చెందిన బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌-బ్యాట్‌) పొరుగుదేశం పాల్పడింది.. దీంతో వెంటనే స్పందించిన భారత బలగాలు ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసి వారి సైనికుడిని మట్టుబెట్టాయి’’ అని ఓ అధికారి చెప్పారు. శనివారం సాయంత్రం 3 గంటల సమయంలో నియంత్రణ రేఖ వద్దనున్న చొరబాటు నిరోధక వ్యవస్థ దగ్గర పాక్‌వైపు ఈ ఘటన చోటుచేసుకుంది. పాక్‌ సైనికుడి కదలికలను గుర్తించిన భారత సైన్యం అప్రమత్తమయ్యింది. అనంతరం చొరబాటుకు అవకాశమున్న మార్గాల్లో మెరుపు దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో సాయంత్రం నాలుగు గంటల సమయంలో పాక్ సైనికుడు మృతి చెందాడు. అతడి వద్ద పాక్ ప్రభుత్వం జాతీయ గుర్తింపు కార్డు, టీకా సర్టిఫికెట్ లభించినట్టు జీఓసీ28 ఇన్‌ఫాంట్రీ డివిజన్ మేజర్‌ జనరల్‌ ఏఎస్‌ పెంధార్కర్‌ చెప్పారు. గుర్తింపు కార్డుపై సైనిక దుస్తులతో ఉన్న అతని ఫొటో ఉందని, మహమ్మద్ షబ్బీర్‌ మాలిక్ అన్న పేరు కూడా ఉందని ఆయన వివరించారు. అతడు పాకిస్థాన్ బ్యాట్ విభాగానికి చెందినవాడిగా ఐడీ కార్డును బట్టి గుర్తించినట్టు తెలిపారు. ‘‘సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ప్రోత్సహిస్తూనే ఉందని ఇది స్పష్టంగా నిర్ధారిస్తుంది.. హాట్‌లైన్ ద్వారా పాక్ ఆర్మీతో మాట్లాడి మరణించిన సైనికుడి మృతదేహాన్ని తీసుకెళ్లాల్సిందిగా భారత్‌ సైన్యం కోరింది’’ అని పేర్కొన్నారు.


By January 03, 2022 at 07:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-army-foiled-pakistan-inflitration-bid-and-pak-soldier-killed-at-kupwara-in-kashmir/articleshow/88656420.cms

No comments