Breaking News

Tollywood Drugs Case: ఈడీ కార్యాలయానికి నవదీప్.. అన్నిటిపై కూపీ లాగుతున్న అధికారులు


టాలీవుడ్‌లో ప్రస్తుతం ఈడీ విచారణతో ఫుల్ స్వింగులో ఉంది. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ శర వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే పూరి జగన్నాథ్, ఛార్మీ, ర‌కుల్ ప్రీత్ సింగ్, నందు, రానా, ర‌వితేజ‌లను విచారించింది. అయితే ఈ కేసుకి వీరికి ఉన్న సంబంధంతో పాటు.. మనీ లాండరింగ్‌ కేసులో విచారణ కూడా చేస్తోంది ఈడీ. డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ఈ విచారణను చేపడుతోంది. ఇప్పటివరకూ జరిగిన విచారణలో పలు కీలక అంశాలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక సెలబ్రిటల బ్యాంకు లావాదేవీలు, యూపీఐ ట్రాన్సాక్షన్లపై కూడా ఈ విచారణ చేస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలను పూర్తిగా సేకరిస్తోంది. అయితే వినాయక చవితి, వీకెండ్ సెలవుల కారణంగా ఈ విచారణకు మూడు రోజుల విరామం ఇచ్చింది. తాజాగా సోమవారం.. నటుడు నవదీప్‌ను విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ నోటీసులు పంపింది. అనుకున్న సమయానికి ఈడీ కార్యాలయానికి వచ్చారు. తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఆయన తనతో పాటు తీసుకువచ్చారు. అయితే ఈ కేసుకు కేంద్ర బిందువుగా ఉన్న ‘ఎఫ్ క్లబ్‌’ పబ్‌కు నవదీప్ యజమానిగా మారడంతో అతను మరింత చిక్కుల్లో ఉన్నారు. ప్రస్తుతానికి ఈడీ అధికారులు అతనిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ డ్రగ్స్ కేసుతో పాటు.. మనీ లాండరిగ్ బ్యాంక్‌ లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విచారణ తర్వాత నవదీప్ ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ అధికారులు తమ తదుపరి విచారణను కొనసాగించనున్నారు. నవదీప్‌ తర్వాత ముమైత్ ఖాన్, తరుణ్, తనీష్ వంటి వారిని ఈడీ అధికారులు విచారణకు పిలిచే అవకాశం ఉంది.


By September 13, 2021 at 12:23PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actor-navdeep-appears-in-ed-office-for-enquiry-in-drugs-case/articleshow/86160986.cms

No comments