Breaking News

బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యేలకు కేంద్ర బలగాలతో భద్రత.. హోం శాఖ నిర్ణయం!


ఎన్నికల ఫలితాల తర్వాత పశ్చిమ్ బెంగాల్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో పలువురు బీజేపీ కార్యకర్తలు మృతిచెందారు. ఈ నేపథ్యంలో బెంగాల్‌లో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించనున్నారు. హింసపై బెంగాల్ ప్రభుత్వం పంపిన నివేదిక ఆధారంగా కేంద్ర బలగాలు, ఉన్నతస్థాయి అధికారుల బృందం చేసిన ప్రతిపాదనలకు కేంద్ర హోం శాఖ ఆమోదం తెలిపినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. బెంగాల్‌లో మొత్తం 77 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు ముప్పు పొంచి ఉందని, కేంద్ర బలగాలతో వీరికి భద్రత కల్పించనున్నారని తెలిపాయి. ‘సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ కమాండోలను భద్రతకు వినియోగిస్తారు. 61 మందికి సీఐఎస్ఎఫ్‌తో ‘ఎక్స్’ కేటగిరీ, మరో 15 మందికి వై కేటగిరీ భద్రత ఉంటుంది.. ఇప్పటికే బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారికి సీఆర్పీఎఫ్ దళాలతో ‘జెడ్’ కేటగిరీ భద్రత కొనసాగుతోంది’ అని అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 77 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. తొలిసారిగా బీజేపీ ప్రధాన ప్రతిపక్షం హోదాను దక్కించుకుంది. మొత్తం 294 స్థానాలకుగానూ 292 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఇందులో 213 సీట్లతో అధికార టీఎంసీ వరుసగా మూడోసారి విజయం సాధించింది. ఒకప్పుడు బెంగాల్‌లో ఓ వెలుగువెలిగి 34 ఏళ్లపాటు పాలించిన వామపక్షాలు కనీసం ఒక్క సీటును కూడా దక్కించుకోలేదు. అలాగే, స్వాతంత్రం తర్వాత కాంగ్రెస్‌కు బెంగాల్‌లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. గత ఎన్నికల్లో 44 సీట్లు గెలిచిన కాంగ్రెస్ సున్నాకే పరిమితమయ్యింది. ఇక, పశ్చిమ్ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మర్నాడు పెద్దయెత్తున హింస చెలరేగింది. ఈ ఘటనల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల దాడుల్లో తమ పార్టీకి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని, పలువురు గాయపడ్డారని బీజేపీ ఆరోపించింది. కాగా, బెంగాల్‌లో హింసాత్మక ఘటనల వేళ ఆ రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర మంత్రి మురళీధరన్‌ కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన కారును దుండగులు ధ్వంసం చేయగా.. కేంద్ర మంత్రి తృటిలో తప్పించుకున్నారు.


By May 11, 2021 at 10:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/west-bengal-all-77-bjp-mlas-to-have-central-security-cover/articleshow/82542211.cms

No comments