Breaking News

కరోనా వైరస్ ఎఫెక్ట్.. 2022లోనే చంద్రయాన్-3 ప్రయోగం


కరోనా వైరస్ కారణంగా అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టుల్లో జాప్యం నెలకుంది. కోవిడ్ మహమ్మారి ప్రభావం భారత్ అంతరిక్ష ప్రయోగాలపై కూడా పడింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపై అధ్యయనానికి ఉద్దేశించిన చంద్రయాన్‌-3 ప్రయోగంలో మరింత వెనక్కు వెళ్లింది. ఈ ప్రయోగాన్ని 2022లో చేపట్టే అవకాశం ఉందని ఛైర్మన్‌ కె.శివన్‌ తాజాగా వెల్లడించారు. ప్రయోగం వాయిదాకు కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ కారణమని... భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ సహా అనేక ప్రాజెక్టులపై దీని ప్రభావం పడిందని వివరించారు. ‘చంద్రయాన్‌-3 ప్రయోగంపై పనిచేస్తున్నాం.. ఇందులో ఆర్బిటర్‌ ఉండదు. ల్యాండర్‌, రోవర్‌ మాత్రమే ఉంటాయి. చంద్రయాన్‌-2లో పంపిన ఆర్బిటర్‌ను దీని కోసం ఉపయోగించుకుంటాం.. దీనిపై ప్రయోగాలు సాగుతున్నాయి.. వచ్చే ఏడాది ప్రయోగించే అవకాశం ఉంది’ అని శివన్‌ తెలిపారు. ఇక, ఇస్రో 2019లో ప్రయోగించిన చంద్రయాన్‌-2 ప్రయోగం చివరి మెట్టుపై విఫలమైన విషయం తెలిసిందే. విక్రమ్‌ ల్యాండర్‌.. చంద్రుడి ఉపరితలపై దిగుతుండగా 2.5 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా కూలిపోయింది. పలు గ్రహాలపైకి వ్యోమనౌకలను పంపాలని ఇస్రో భావిస్తున్న తరుణంలో చంద్రయాన్‌-3ను విజయవంతంగా ప్రయోగించి అంతరిక్ష యాత్రల్లో సత్తా చాటడం ఈ సంస్థకు చాలా కీలకం. గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు సన్నాహకంగా తొలి విడతలో నిర్వహించే మానవరహిత అంతరిక్షయాత్ర ఈ ఏడాది డిసెంబరు ఉండొచ్చని శివన్‌ తెలిపారు. వాస్తవానికి గతేడాది డిసెంబరులో దీనిని నిర్వహించాల్సి ఉందన్నారు. దీని తర్వాత మరో మానవరహిత ప్రయోగాన్ని నిర్వహిస్తామని, అనంతరం మానవసహిత యాత్రను చేపడతామని వివరించారు. మానవసహిత యాత్రకు రష్యా సహకారం అందజేస్తోంది. ఈ యాత్రలో పాల్గొనే నలుగురు వ్యోమగాములకు అక్కడ శిక్షణ కొనసాగుతోంది. గగన్‌యాన్ మూడో మాడ్యూల్ ఎప్పుడు చేపడతారన్న ప్రశ్నకు శివన్ బదులిస్తూ.. ఈ ప్రయోగానికి టెక్నాలజీని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అన్ని సాంకేతికతలు సంపూర్ణంగా ఉన్నాయా? లేదో తనిఖీ చేసిన తర్వాత (మానవసహిత మిషన్) సమయాన్ని మేం నిర్ణయిస్తాం’ అని పేర్కొన్నారు.


By February 22, 2021 at 10:04AM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/chandrayaan-3-launch-delayed-further-to-2022-isro-chief-sivan/articleshow/81146146.cms

No comments