Breaking News

కరోనా నివారణకు హైడ్రాక్సీ క్లోరోక్విన్.. ఐసీఎంఆర్ కీలక మార్గదర్శకాలు


ప్రాణాంతక కరోనా వైరస్‌కు ఇప్పటి వరకూ ఎలాంటి చికిత్స, వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రపంచవ్యాప్తంగా దీనిపై ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహమ్మారికి విరుగుడుగా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ సమర్థంగా పనిచేస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్‌) తాజాగా వెల్లడించింది. వైరస్‌ సోకే ముప్పు అధికంగా ఉన్నవారికి నివారణ చర్యల్లో భాగంగా దీనిని వినియోగించవచ్చని పేర్కొంది. ఈ మేరకు కొవిడ్‌-19పై తాము ఏర్పాటుచేసిన నేషనల్ టాస్క్‌ఫోర్స్ సిఫార్సు చేసినట్లు తెలిపింది. సంబంధిత ప్రొటోకాల్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ) ఆమోదం తెలిపినట్టు పేర్కొంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వినియోగంపై మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా సోకే ముప్పు ఎక్కువగా ఉన్నవారు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఔషధాన్ని వాడాలని అది కూడా ముందస్తు నివారణ చర్యల్లో భాగంగానే తీసుకోవాలని డైరక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ తెలిపారు. ఈ ఔషధ నిల్వలు మన దేశంలో తగినంతగా ఉన్నాయని స్పష్టం చేశారు. కరోనా బాధితులు, వారి కుటుంబసభ్యులకు, అనుమానితులు, వైద్య సేవలు అందించే సిబ్బంది కోవిడ్‌-19 లక్షణాలు లేకపోయినా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, దీనిపై అపోహలు వద్దని సూచించింది. అయితే, ఎప్పటి మాదిరిగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకుకోవాలని తెలిపింది. శ్వాస సంబంధిత జాగ్రత్తలు, వ్యక్తిగత భద్రతా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. కరోనా రోగుకలు చికిత్స అందజేసే వైద్య సిబ్బంది తమ ఆరోగ్యాన్ని సైతం నిరంతరం గమనించుకోవాలని, కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యాధికారులకు సమాచారం అందజేయాలని వివరించింది. కరోనా బాధితులతో హై రిస్క్‌ కాంటాక్ట్స్‌ ఉన్నవారు చికిత్స తీసుకుంటున్నా ఇంటికి వెళ్లిన తర్వాత స్వీయ నిర్బంధంలో ఉండాలంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను రిజిష్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషినర్‌ సూచనల మేరకే తీసుకోవాలని, సైడ్ ఎఫెక్ట్స ముప్పు ఉంటే దానిని వాడరాదని తెలిపింది. జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలతో ఉన్న వ్యక్తులు ఈ ఔషధాన్ని వినియోగిస్తున్నప్పుడు ఏవైనా ఇతర లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. కోవిడ్ బాధితులకు చికిత్స చేస్తున్న సిబ్బంది మొదటి రోజు రెండుసార్లు 400 mg, తర్వాత ఏడు వారాలపాటు వారానికి ఒకసారి 400 mg భోజనంతో కలిపి తీసుకోవాలి.. బాధితుల కుటుంబ సభ్యులు తొలి రోజు రెండుసార్లు 400mg,తర్వాత మూడు వారాలపాటు వారానికి 400mg ఆహారంతో పాటు తీసుకోవాలని వివరించింది. ఇక, ముందస్తు జాగ్రత్తలో భాగంగా 15 ఏళ్లలోపు పిల్లలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఇవ్వరాదని పేర్కొంది. ఏవైనా దుష్ప్రభావాలు తలెత్తితే హెల్ప్‌లైన్‌ ద్వారా గానీ, యాప్‌ ద్వారా గానీ ఫిర్యాదు చేయాలి.


By March 24, 2020 at 08:51AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/icmr-recommends-use-of-hydroxy-chloroquine-for-high-risk-coronavirus-cases/articleshow/74785219.cms

No comments