Breaking News

మాస్కుల వాడకంపై ఆరోగ్య శాఖ కీలక సూచన


కర్ణాటకలో కొత్తగా రెండు కేసులను గుర్తించారు. కలబుర్గిలో ఒక కేసు నమోదు కాగా.. బెంగళూరులో మరో కేసు నమోదైందని వైద్య విద్య శాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ సోమవారం తెలిపారు. వీరిద్దర్నీ క్వారంటైన్‌లో ఉంచామని తెలిపారు. కలబుర్గిలో కరోనా కారణంగా ఒకరు చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా కరోనా బారిన పడిన ఇద్దరిలో కరోనా మృతుడిని కలిసిన వారొకరు ఉండగా... ఇటీవల యూరప్ వెళ్లి వచ్చిన 20 ఏళ్ల యువతి మరొకరు. సోమవారం నాటికి భారత్‌లో కోవిడ్ కేసుల సంఖ్య 114కి చేరింది. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో.. అమెరికాలోని సియాటెల్‌లో మనుషులపై వ్యాక్సిన్‌ను ప్రయోగిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటాయనే ఉద్దేశంతో ప్రజలు మాస్కుల కోసం ఎగబడుతున్నారు. దీంతో మాస్కుల కొరత తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో మాస్కుల వాడకంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. అందరూ మాస్కులు వాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి కరోనా లక్షణాలు కనిపిస్తే.. కోవిడ్ అనుమానితులు లేదా సోకిన వారి బాధ్యతలను తీసుకుంటే.. శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న పేషెంట్ల దగ్గర పని చేసే హెల్త్ వర్కర్ అయితేనే మాస్కులు వాడకం తప్పనిసరి అని సూచించింది. ఆరు గంటలకు ఓసారి లేదా తడిగా అయినప్పుడు మాస్కులను మార్చాలని ఆరోగ్య శాఖ సూచించింది. ముక్కు, నోరు, గెడ్డాన్ని కవర్ చేసేలా మాస్క్ ధరించాలని, ఒకసారి వాడిన మాస్కును మూత ఉన్న డస్ట్‌బిన్‌లలో పడేయాలని సూచించింది. ఒక మాస్క్‌ను ఒక్కసారి మాత్రమే వాడాలని.. వాటిని వాడుతున్నప్పుడు, తీసేటప్పుడు మాస్కుల ముందు భాగాన్ని చేతులతో తాకొద్దని సూచించింది. మాస్క్ తొలగించిన తర్వాత సబ్బు నీళ్లు, ఆల్కహాల్ శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించింది.


By March 17, 2020 at 09:21AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-ministry-of-health-and-family-welfare-has-issued-guidelines-on-use-of-masks-by-public/articleshow/74666266.cms

No comments