Breaking News

వుహాన్ నుంచి ఢిల్లీ చేరిన భారతీయులు.. రెండు వారాల తర్వాతే స్వస్థలాలకు!


కరోనా వైరస్‌ స్వైరవిహారం చేస్తున్న చైనాలోని హుబే ప్రావిన్సుల్లో చిక్కుకున్న భారతీయులు శనివారం ఉదయం 7.30 గంటలకు ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం వీరికోసం కేంద్రం ప్రత్యేక విమానాన్ని వుహాన్‌కు పంపిన విషయం తెలిసిందే. హుబే ప్రావిన్సులో మొత్తంలో 600 మందికిపైగా భారతీయులు ఉండగా.. వారిలో 400 మంది తమను స్వదేశానికి తీసుకెళ్లాలని కోరడంతో కేంద్రం స్పందించింది. వీరిని తరలించడానికి రెండు విమానాలను అక్కడకు పంపడానికి చైనా ప్రభుత్వం అనుతి తీసుకుంది. తాజాగా, ఢిల్లీకి 324 మంది చేరుకోగా, మరికొంత మందిని తీసుకురావడానికి నేడు మరో విమానం వెళ్లనుంది. ప్రస్తుతం భారత్‌కు చేరుకున్నవారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 60 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 56 మంది ఇంజినీర్లు, తెలంగాణకు చెందిన ఐదుగురు ఉన్నట్టు సమాచారం. వుహాన్ నుంచి వచ్చినవారి కోసం హర్యానాలోని మానేసర్‌ సమీపంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వీరికి వైరస్ స్క్రీనింగ్‌ పరీక్షలు రెండు దశల్లో జరుగుతాయి. తొలుత ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పరీక్షించిన అనంతరం మానేసర్‌ కేంద్రానికి తరలించి అక్కడ మరింత క్షుణ్నంగా పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానిస్తే వారిని వెంటనే బేస్‌ హాస్పిటల్‌ ఢిల్లీ కంటోన్మెంట్‌‌కు తరలిస్తారు. జ్వరం, దగ్గు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారిని బీహెచ్‌డీసీకి తరలించి, ఈ లక్షణాలు లేనివారిని కూడా మానేసర్‌లోనే ఉంచుతారు. వీరికి ప్రతిరోజు వైద్య పరీక్షలు నిర్వహించి, రెండు వారాల తర్వాత వైరస్‌ లక్షణాలేవీ కనిపించకపోతే స్వస్థలాలకు పంపుతారు. ఢిల్లీలోని ఛావ్లా ప్రాంతంలో ఐటీబీపీ ఆధ్వర్యంలో 600 పడకలతో కూడిన ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. శుక్రవారం ఉదయం వుహాన్ చేరుకున్న ఎయిరిండియా విమానంలో ఐదుగురు సభ్యుల వైద్య బృందాన్ని పంపారు. విమానంలో ప్రయాణికులు అస్వస్థతకు గురైతే అత్యవసర వైద్య సేవలను అందజేయడానికి ఈ బృందాన్ని పంపినట్టు అధికారులు తెలిపారు.


By February 01, 2020 at 09:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/air-india-special-flight-takes-off-from-wuhan-with-324-indians-on-board/articleshow/73828297.cms

No comments