పట్టిసీమ నుంచి నీటి సరఫరా నిలిపివేయమని సీఎంను కోరుతా: మంత్రి పిల్లి!

పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం ఏలూరు కలెక్టరేట్లో శనివారం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి హోదాలో సమావేశానికి హాజరైన ఆయన నుంచి నీటి తరలింపు నిలిపివేయాలని సీఎంను కోరుతానని అన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి నది నుంచి కృష్టా డెల్టాకు నీటి తరలింపు ప్రక్రియ గతవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. స్థానిక అవసరాలే తీరని క్రమంలో పట్టిసీమ నుంచి నీటి తరలింపును నిలిపివేయాలని కోరుతూ, సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకెళతానని ఆయన అన్నారు. పట్టిసీమ ద్వారా నీటిని తరలించడంపై సమావేశంలో ఎమ్మెల్యేలంతా అసంతృప్తి వ్యక్తం చేశారని ఆయన వివరించారు. జిల్లాలోని నారుమడులకు నీరందక రైతులు ఆందోళన చెందుతూ, పట్టిసీమ నుంచి నీటి తరలింపుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని మంత్రి పిల్లి పేర్కొన్నారు. స్థానిక అవసరాలకే నీరు చాలనప్పుడు ఎలా ఎత్తిపోస్తారని ఆయన ప్రశ్నించారు. బచావత్ అవార్డు ప్రకారం స్థానిక అవసరాలకు పోనూ మిగులు జలాలను మాత్రమే ఇతర ప్రాంతాలకు తరలించాల్సి ఉందని గుర్తుచేశారు. ప్రజాప్రతినిధులంతా వ్యతిరేకిస్తున్నందున నీటి విడుదల నిలిపివేయాలని సీఎంని కోరతానని డిప్యూటీ సీఎం తెలిపారు. మరోవైపు, పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపి డెల్టాను కాపాడాలని పశ్చిమగోదావరి జిల్లా రైతు కార్యాచరణ సమితి వ్యవస్థాపకుడు ర్యనారాయణరాజు ప్రభుత్వాన్ని కోరారు. రైతు కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. డెల్టా ప్రాంతాల్లో నారుమడులకు సాగునీటి కొరత ఉందన్నారు. ఎలాంటి అనుమతులు లేని పట్టిసీమ ప్రాజెక్టును తొలగించి సాగునీటి కొరత సమస్యను పరిష్కరించాలని సీఎం జగన్మోహన్రెడ్డికి సూచించారు. రైతాంగం సమస్యలపై రైతు కార్యాచరణ సమితి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రులను కలిసి సీఎం వద్దకు వెళ్లనున్నట్టు ఆయన తెలిపారు.
By June 30, 2019 at 08:13AM
No comments