Breaking News

‘ఏపీకి సీఎం కావాలంటే జైలుకు వెళ్లొచ్చిన అర్హత ఉండాల్సిందే’!


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నేత, చేసిన వ్యాఖ్యలు కలకలం రేగుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అవ్వాలంటే జైలుకు వెళ్లి వచ్చిన క్వాలిఫికేషన్ ఉండాల్సిందేనని ప్రజలు నిరూపించారని అశోక్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ఛానల్ చర్చా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న వివిధ నిర్ణయాలపై విచారణకు జగన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశారు. దీనిపై ఓ టీవీ చానల్ నిర్వహించిన డిబేట్‌లో అశోక్ బాబు మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం విశేషం. చంద్రబాబుపై ఏదో రకంగా అవినీతి ముద్ర వేసి జైలుకు పంపాలని జగన్ చూస్తున్నారని ఆయన ఆరోపించారు. వాస్తవానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో అధికారుల పాత్రే ఎక్కువగా ఉంటుందని, మరి వారిని కూడా జైలుకు పంపుతారా? అని అశోక్ బాబు నిలదీశారు. జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి కూడా కమిటీలు వేశారని, కానీ చంద్రబాబును ఏమీ చేయలేకపోయారని ఉద్ఘాటించారు. ఒకవేళ పలానా అంశంలో అవినీతి జరిగిందని భావిస్తే జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సవాల్ విసిరారు. అంతేతప్ప ఏదో రకంగా అవినీతి ముద్ర వేయాలనుకోవడం సరికాదని అశోక్ బాబు హితవు పలికారు. మరోవైపు, వైసీపీ చేస్తోన్న ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం తన నివాసంలో ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలోనూ ఇలాంటి అభిప్రాయమే వ్యక్తమైంది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై సమీక్ష పేరిట చేస్తున్న హడావుడి వసూళ్ల కోసమేనని టీడీపీ ఆరోపించింది. అప్పట్లో వైఎస్‌ కూడా అచ్చం ఇలాగే చేశారని, పీపీఏలు సమీక్షించి ధరలు తగ్గిస్తామంటూ టీడీపీపై బురద చల్లి వసూళ్లు చేసుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆయన కుమారుడు జగన్‌ కూడా అదే బాటలో పయనిస్తున్నారని విమర్శలు గుప్పించారు. గత టీడీపీ ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా వ్యవహరిస్తున్నారని, ప్రతి ఆరోపణకూ గట్టిగా సమాధానం ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రాభివృద్ధిని గాలికి వదిలేసిన ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు పైనే దృష్టిసారించిందని దుయ్యబట్టారు. గత ఐదేళ్లలో పారదర్శక పాలన అందించామని, జాతీయంగా, అంతర్జాతీయంగా రాష్ట్ర ప్రతిష్ఠ పెంచామన్నారు. కొత్త ప్రభుత్వం దానికి కొనసాగింపుగా పెట్టుబడులు తేవడం, పరిశ్రమలు స్థాపించడం, యువతకు ఉపాధిని కల్పించకపోవడంపై దృష్టి పెట్టకపోవడం బాధాకరమని అన్నారు.


By June 28, 2019 at 10:33AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/mlc-tdp-leader-ashok-babu-controversy-comments-on-ysrcp-victory-in-ap-elections/articleshow/69984864.cms

No comments