Breaking News

వియన్నాలో ఉగ్రదాడి.. ముగ్గురి మృతి, 12 మందికి గాయాలు


యూరప్ దేశాల్లో ఉగ్రదాడులు కొనసాగుతున్నాయి. తాజాగా రాజ‌ధాని వియ‌న్నాలో సాయుధులైన ఇద్దరు దుండగులు గన్‌తో రక్తపాతం సృష్టించారు. కేఫ్‌లు, రెస్టారెంట్ల వద్ద గడుపుతున్న వారిని లక్ష్యంగా చేసుకొని కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. 12 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం (నవంబర్ 2) రాత్రి 8 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. న‌గ‌రంలోని ఆరు ప్రాంతాల్లో దుండ‌గులు ఆధునిక రైఫిళ్లతో ఫైరింగ్ జ‌రిపారు. మృతి చెందిన వారిలో ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఉన్నారు. ఇది ఉగ్రవాద దాడేనని, ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని ఆస్ట్రియా ఛాన్స్‌లర్ సెబాస్టియ‌న్ కుర్జ్ వెల్లడించారు. దాడి అనంతరం వియన్నా నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు ముష్కరుల కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అనంతరం పోలీసులు ఓ సాయుధుడిని మ‌ట్టుబెట్టిన‌ట్లు ఆస్ట్రియా ఛాన్స్‌లర్ ప్రకటించారు. మ‌రో దుండగుడి కోసం ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. వియ‌న్నా సెంట్రల్‌లో ఉన్న యూదుల మందిరం వ‌ద్ద షూటింగ్ జ‌రిగింది. అయితే.. ఆ మందిరాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేశారా అనే అంశంపై స్పష్టమైన వివరాలు లేవని అధికారులు తెలిపారు. దాడి అనంతరం ఆ యూదుల మందిరాన్ని మూసివేసిన‌ట్లు ఆ వ‌ర్గ నేతలు తెలిపారు. దేశంలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఆస్ట్రియా మరోసారి దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ ఆంక్షలు విధించింది. దీంతో చాలా మంది జ‌నం బార్లు, రెస్టారెంట్ల వ‌ద్ద ఎగ‌బ‌డ్డారు. ఆ స‌మ‌యంలో అత్యాధునిక ఆయుధాల‌తో వ‌చ్చిన సాయుధులు.. కేఫ్‌లు, రెస్టారెంట్ల వ‌ద్ద ఉన్న జ‌నాన్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులు జ‌రిపారు. ఈ ఉగ్రదాడిని యురోపియ‌న్ నేతలు ముక్తకంఠంతో ఖండించారు. ఈ దాడి వార్తతో షాకైన‌ట్లు బ్రిట‌న్ ప్రధాని బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పలువురుు షేర్ చేస్తున్నారు. వియన్నా దాడిని 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడితో పోలుస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఆస్ట్రియా వెంట మేం ఉన్నాం అంటూ పలువురు ప్రముఖులు కామెంట్లు పెట్టారు. వియన్నాలో ఉన్న భారతీయుల క్షేమ సమాచారాన్ని ఆరా తీస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు. ఫ్రాన్స్‌లో కొన్ని రోజుల కిందట ఓ దుండగుడు కత్తితో రక్తపాతం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఐదుగురు మృతి చెందారు. అంతకుముందు మరో దుండగుడు ఓ టీచర్‌ను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం కెనడాలో జరిగిన ఇదే తరహా దాడిలో ఇద్దరు మృతి చెందారు. Don't Miss: Also Read:


By November 03, 2020 at 01:49PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/austria-terror-attack-gunmen-opened-fire-in-vienna-central-3-killed-12-injured/articleshow/79016569.cms

No comments