Breaking News

షోపియాన్ ఎన్‌కౌంటర్‌: ఆ చట్టాన్ని ఉల్లంఘించి అధికార దుర్వినియోగం.. చర్యలకు సైన్యం ఆదేశం


జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్‌లో రెండు నెలల కిందట జులైలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలను సేకరించింది. షోపియాన్‌ జిల్లా అమ్షిపొరలో జులై 17న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులను సైన్యం మట్టుబెట్టింది. అయితే, ఎన్‌కౌంటర్‌లో ‘భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టం-1990’ ద్వారా లభించిన అధికారాలను భద్రతా దళాలు ఉల్లంఘించడంతో క్రమశిక్షణ చర్యలకు ఆదేశించినట్లు సైనికాధికారులు శుక్రవారం వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురు వ్యక్తులు జమ్మూలోని రాజౌరీ జిల్లాకు చెందిన వారనీ, వారు అమ్షిపొర వద్ద తప్పిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారమైన కథనాలు సూచిస్తున్నాయని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్‌ రాజేశ్‌ కాలియా తెలిపారు. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో నైతిక విలువలకు కట్టుబడి భారత సైన్యం దర్యాప్తు ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు. చనిపోయిన ముగ్గురు వ్యక్తుల కుటుంబ సభ్యులు సైతం ఎన్‌కౌంటర్‌ విషయంలో పోలీసులకు ఫిర్యాదుచేశారు. నాలుగు వారాల్లోనే సైన్యం ఈ కేసు దర్యాప్తును పూర్తి చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయి ఇంతియాజ్ అహ్మద్, అబ్రార్ అహ్మద్, మొహమూద్ అబ్రార్‌లు ఉగ్రవాదులు కాదని, షోపియాన్‌లో పనికోసం వెళ్లినట్టు వారి కుటుంబాలు తెలిపాయి. సుప్రీంకోర్టు ఆమోదించినట్టుగా ఆర్మీ చేయాల్సినవి, చేయకూడనవి దానికి విరుద్ధమని తేలింది.. పర్యవసానంగా ఆర్మీ చట్టం ప్రకారం క్రమశిక్షణా చర్యలను ప్రారంభించాలని ఆదేశించామని అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురు రాజౌరీ నుంచి షోపియాన్‌కు వచ్చారు, వారి డీఎన్ఏ నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం.. ఉగ్రవాదులతో సంబంధం ఉందా? లేదా అనే అంశంపై కూడా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. షోపియాన్ ఎన్‌కౌంటర్‌కు 62 రాష్ట్రీయ రైఫిల్స్‌ను అధికారులను బాధ్యులుగా పేర్కొన్నట్టు తెలుస్తోంది. కానీ నేరుగా ఈ చర్యలో పాల్గొన్న సిబ్బందిపై ఆర్మీ చట్టాల ప్రకారం క్రమశిక్షణా చర్యలను ప్రారంభించే పనిలో ఉన్నట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. అమ్షిపొరలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో సీఆర్పీఎఫ్, పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా జులై 17న ఆపరేషన్ చేపట్టాయని ఆర్మీ అధికార ప్రతినిధి వివరించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించామని, వారి మృతదేహాలకు పోస్ట్‌మార్టం అనంతరం అంత్యక్రియల కోసం బారాముల్లాకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.


By September 19, 2020 at 06:57AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/army-officials-to-face-disciplinary-action-in-shopian-encounter-in-jammu-and-kashmir/articleshow/78197922.cms

No comments