Breaking News

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ హక్కు రాష్ట్రాలదే.. సుప్రీంకోర్టు తాజా తీర్పు


రిజర్వేషన్ల అంశంపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో విద్య, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లలు, ఎస్సీ ఎస్టీల వర్గీకరణపై 2004లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని తాజాగా నిర్ణయించింది. రిజర్వేషన్ల అంశంపై పంజాబ్ హైకోర్టు 2004లో ఇచ్చిన తీర్పుతో జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విభేదించింది. అంతేకాదు, దేశ సమాఖ్య వ్యవస్థ దృష్ట్యా.. ఎస్సీ ఎస్టీల వర్గీకరణ, వారిలో వెనుకబడ్డ కులాలకు రిజర్వేషన్‌ కల్పించే అధికారం రాష్ట్రాలకు ఉందని తేల్చిచెప్పింది. ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించిన వర్గీకరణ అధికారం ఇప్పటి వరకూ పార్లమెంట్‌కు మాత్రమే ఉండేది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ అధికారం లేదని 2004లో ‘ఈవీ చిన్నయ్య వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ’ కేసులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. రెండూ ఐదుగురు సభ్యుల ధర్మాసనాలే కాబట్టి తాజాగా బెంచ్‌ ఇచ్చిన తీర్పు తక్షణం అమలు కాదు. ఈ కీలకాంశంపై విచారణను విస్తృత ధర్మాసనం చేపట్టాలని కోరుతూ కేసును చీఫ్‌ జస్టిస్‌ బోబ్డేకు నివేదించింది. దీంతో ఏడు లేదా తొమ్మిది మంది సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం త్వరలోనే దీనిని చేపట్టవచ్చని న్యాయ వర్గాలు వ్యాఖ్యానించాయి. తాజా తీర్పుతో తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు జరిగిన ప్రయత్నాలకు ఊపిరిలూదింది. క్రీమీ లేయర్‌ అంశాన్ని కూడా చర్చలోకి తీసుకొచ్చింది. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16, 338, 341, 342, 342ఎలు ఎంతో ప్రాధాన్యత కలిగినవి.. వీటిని సరైన రీతిలో విడమర్చి చెప్పాలి. ఇందిరా సహానీ సహా ఇతర కేసుల విషయంలో ఇది జరిగింది. 2004లో చిన్నయ్య కేసును విచారించిన ధర్మాసనం ఇచ్చిన తీర్పు సరికాదు. వాస్తవాలను గుర్తించకపోతే సామాజిక మార్పు జరగాలన్న రాజ్యాంగ లక్ష్యం నెరవేరదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘జనాభా ప్రాతిపదికన షెడ్యూల్డ్‌ కులాల వారికి రిజర్వేషన్లు కల్పించారు. వెనుకబాటుతనం కారణంగా వీరిలో కొంత మందికి రిజర్వేషన్లు అందడంలేదు. ఆర్టికల్‌ 341(2)లో ఉన్న అన్ని ఎస్సీ కులాలకు రిజర్వేషన్‌ వర్తిస్తుంది. కొన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చి మిగతా వాటిని విస్మరించడం తగదు. జీవితాంతం ఆ వెనుకబడిన కులాలు అలానే వెనుకబాటుతనంతోనే మిగిలిపోవాలా? ఈ రిజర్వేషన్లు అందనివారు నిరుపేదలు. కులం అంటే ఓ తరగతి ప్రజానీకం. జాబితాలోని మిగిలిన కులాలకు నష్టం జరగకుండా నిమ్నవర్గాల్లో అతి వెనుకబడ్డ కులాలను ఉపవర్గీకరించి- వారికి రిజర్వేషన్లను (పంజాబ్‌) కల్పించింది. ఇది సరైనదే. 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రాతిపదికగా చేసుకుని పంజాబ్‌ హైకోర్టు ఈ కేసును కొట్టేయడం తగదు’ అని తీర్పులో పేర్కొంది.


By August 28, 2020 at 07:31AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-seven-judge-bench-to-hear-case-on-bringing-sub-classification-in-sc/st-reservation-list/articleshow/77795525.cms

No comments