Breaking News

రాజకీయ రంగు పులుముకున్న నీట్, జేఈఈ నిర్వహణ.. కేంద్రంపై విపక్షాల విమర్శలు


కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్ష జేఈఈ, నీట్‌‌లను సెప్టెంబరు 1 నుంచి నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా, ఈ వ్యవహారం పూర్తి రాజకీయ రంగు పులుముకుంది. కొవిడ్‌ ఉధృతి దృష్ట్యా పరీక్షల నిర్వహణ వాయిదా వేయాలని విద్యార్థిలోకం గళమెత్తడంతో విపక్షాలు వారికి గొంతుకలిపాయి. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షత బుధవారం విపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నీట్, జేఈఈ నిర్వహణ విషయంలో కేంద్రం వైఖరిపై తీవ్రంగా మండిపడ్డాయి. దీనిపై ఉమ్మడిగా కలిసి పోరాడుదామని నిర్ణయించారు. పరీక్ష వాయిదా కుదరదని తీర్పు ఇచ్చినప్పటికీ- విద్యార్థుల కోసం మరోసారి సుప్రీంలో రివ్యూ వేద్దామని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించారు. దీనికి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఏడు రాష్ట్రాల సీఎంలు సమ్మతించారు. మరోవైపు, కేంద్రం మాత్రం ఈ విషయంలో నిర్ణయం మార్చుకునేది లేదని సంకేతాల్నిచ్చింది. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలు కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌, భూపేశ్‌ బాఘేల్‌, వి.నారాయణస్వామి, అశోక్‌ గెహ్లాట్, పశ్చిమ్ బెంగాల్‌, మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాల సీఎంలు మమతా బెనర్జీ, ఉద్ధవ్‌ ఠాక్రే, హేమంత్‌ సొరెన్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, కేరళ సీఎం పినరయి విజయన్‌ కూడా పరీక్ష వాయిదా వేయాలని కేంద్రాన్ని ఇప్పటికే కోరారు. ఈ సమావేశానికి కేరళ సీఎం విజయన్‌ను ఆహ్వానించాలని సోనియా భావించినా స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్‌కు ఆహ్వానం పంపినా ఆయన హాజరుకాలేదు. ‘రైళ్లు లేవు, బస్సులు అంతంత మాత్రంగానే తిరుగుతున్నాయి.. ప్రజా రవాణా ఇబ్బందిగా ఉంది. సిబ్బంది కూడా విముఖంగా ఉన్నారు. విద్యార్థులంతా భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనా పరీక్షలు నిర్వహించేది? నిర్వహిస్తే విద్యార్థుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది’ అని మమత బెనర్జీ అన్నారు. ‘విద్యార్థుల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదు. వారి ఆరోగ్యం, భద్రతపై చింతలేదు. నూతన విద్యావిధానమే అశాస్త్రీయంగా ఉంది. లక్షల మంది కోరుతున్నా మొండిగా వ్యవహరిస్తున్నారు’ అని సోనియా దుమ్మెత్తారు. ‘పరీక్షలు జరపాల్సిందే. కానీ ఎలా? విద్యార్థుల కోసం అనేక లాడ్జ్‌లు, నివాస స్థలా లు సిద్ధం చేయాలి? ఈ పరిస్థితుల్లో ఎలా సాధ్యం?’ అని ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్‌ ప్రశ్నించారు. అందరం కలిసి ప్రధానికి విజ్ఞాపన చేద్దామని అమరీందర్‌ సింగ్‌ అన్నారు.


By August 27, 2020 at 07:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/opposition-cms-want-neet-jee-put-off-will-seek-supreme-court-rethink/articleshow/77775097.cms

No comments