Breaking News

ద్రౌపదిలా విద్యార్థులు.. సీఎంలు కృష్ణుడి పాత్ర పోషించాలి: బీజేపీ ఎంపీ సంచలన ట్వీట్


దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలను నిర్వహించాలన్న కేంద్రం నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ... సోనియా గాంధీ నాయకత్వంలో ఏడుగురు సీఎంలు సమావేశమై ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణకే సిద్ధపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో రాజ్యసభ సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత మోదీ సర్కారుకు వ్యతిరేకంగా గళం విప్పారు. దేశంలో 11 మంది ముఖ్యమంత్రులు నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణను వ్యతిరేకిస్తున్నా.. సుప్రీం కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది..? సీఎంలకు అధికారం లేదా..? అని ట్విట్టర్ వేదికగా స్వామి ప్రశ్నించారు. సార్ ఏదైనా ఆశ ఉందా..? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఈ అంశం ఇప్పుడు ముఖ్యమంత్రుల చేతిలో ఉందని ఆయన బదులిచ్చారు. పార్టీ విధేయత అనేది విధానాలకు మాత్రమే ఉంటుందని.. పరిపాలనపరమైన నిర్ణయాలను ప్రశ్నించడం పార్టీని ధిక్కరించినట్లు కాదన్నారు. ‘నీట్, జేఈఈ పరీక్షల విషయంలో విద్యార్థులు ద్రౌపదిలా కనిపిస్తున్నారు.. సీఎంలు కృష్ణుడి పాత్ర పోషించగలరు. ఓ విద్యార్థిగా 60 ఏళ్లపాటు ప్రొఫెసర్‌గా నాకున్న అనుభవం ప్రకారం.. పరీక్షలను షెడ్యూల్ చేయడం తప్పనిపిస్తోంది. ఇప్పుడు నన్ను నేను విదురుడిలా భావిస్తున్నా’నంటూ సుబ్రమణ్యస్వామి మరో ట్వీట్ చేశారు. తమ రాష్ట్రాల్లోని విద్యార్థులు సురక్షితంగా పరీక్షా కేంద్రాలకు వెళ్లడానికి.. పరీక్ష రాసి తిరిగి ఇంటికి చేరడానికి సీఎంలు గ్యారంటీ ఇవ్వగలరా? అని స్వామి ప్రశ్నించారు. అలా హామీ ఇవ్వలేకపోయినప్పుడు.. ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పాలి, పరీక్షలు నిర్వహించలేమని ప్రధానికి స్పష్టం చేయాలని సీఎంలకు స్వామి సూచించారు.


By August 28, 2020 at 11:03AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/neet-jee-exams-postponement-students-like-draupadi-cms-can-play-the-role-of-krishna-says-subramanian-swamy/articleshow/77798112.cms

No comments