Breaking News

KCR వల్లే గెలుపు.. 30 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని.. మూడున్నరేళ్లలో చేసి చూపిస్తా: సైదిరెడ్డి


ఫలితాల్లో కారు జోరు మీదుంది. 8 రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థి పద్మావతిపై 17,400 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కేసీఆర్ వ్యూహాత్మకంగా పోల్ మేనేజ్‌మెంట్ చేయడంతో.. ఉత్తమ్ కుటుంబానికి గట్టిపట్టున్న హుజూర్‌నగర్‌లో గులాబీ జెండా ఎగరేయడం దాదాపు ఖాయమైంది. భారీ ఆధిక్యం దూసుకెళ్తున్న సైదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెల్లడయ్యాక కేసీఆర్‌ను కలుస్తానన్నారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు, టీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తున్నాయని సైదిరెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం ప్రణాళికను రూపొందిస్తామన్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే.. ఆయన ఎవరూ ఊహించని భారీ మెజార్టీతో గెలుస్తానని తెలిపారు. నా పట్ల, టీఆర్ఎస్ పార్టీ పట్ల హుజూర్‌నగర్ ప్రజలు నమ్మకం ఉంచారని సైదిరెడ్డి తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి పని చేసినా.. ఫలితం లేకపోయిందన్నారు. కేసీఆర్ సర్కారుపై విద్వేషం చిమ్మినా ఫలితం లేకపోయిందన్నారు. హుజూర్‌నగర్‌ను మంచి నియోజకవర్గంగా మలుస్తానన్నారు. యువతకు ఉద్యోగాలను కల్పించడం, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తానని.. 20 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తానని చెప్పారు. ఉత్తమ్ చేసిన 30 ఏళ్ల అభివృద్ధిని.. తాను మూడున్నరేళ్లలోనే చేసి చూపిస్తానని సైదిరెడ్డి పునరుద్ఘాటించారు. హుజూర్‌నగర్‌లో విజయోత్సవ సభకు ఇప్పటి వరకూ ఎలాంటి ప్లాన్ చేయలేదని ఆయన తెలిపారు.


By October 24, 2019 at 10:22AM


Read More https://telugu.samayam.com/telangana/news/huzurnagar-bypoll-result-trs-candidate-saidireddy-reveals-his-plans-about-the-constitution/articleshow/71733931.cms

No comments