Breaking News

Congress కంచుకోట.. హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ ఘనవిజయం.. ఇదే ప్రధాన కారణం!


కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి హుజూర్‌నగర్‌లో గులాబీ జెండా ఎగరేసింది. హస్తం నేతలు ఊహించని రీతిలో భారీ మెజార్టీతో గెలుపొందింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన స్థానంలో ఆయన భార్యను పోటీకి దింపినా.. ఫలితం లేకపోయింది. పద్మావతి విజయం కోసం విబేధాలను పక్కనబెట్టి కాంగ్రెస్ నేతలంతా ఏకమైనప్పటికీ.. ఫలితం లేకపోయింది. నియోజకవర్గంపై ఉత్తమ్ కుటుంబానికి ఉన్న పట్టు, ఆర్టీసీ సమ్మె, రెవిన్యూ ఉద్యోగుల్లో అసంతృప్తి తదితర అంశాలు తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ భావించింది. కానీ కారు జోరు ముందు హస్తం నిలువలేకపోయింది. హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ విజయానికి కారణాలేంటో ఓసారి చూద్దాం.. ఉపఎన్నికలంటే చాలు టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడాలేని ఉత్సాహం వస్తుంది. గతంలో పాలేరు ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పట్ల సానుభూతి ఉన్నప్పటికీ.. తుమ్మల నాగేశ్వర రావును గెలిపించుకుంది. ఎన్నికల వ్యూహాల రూపకల్పన, క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై త్వరగా అవగాహనకు రావడం, సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం ఇవ్వడం దీనికి కారణం. ఇక విషయానికి వస్తే.. ఉపఎన్నిక ఖాయమని తెలిసిన నాటి నుంచే టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కేసీఆర్, హరీశ్ రావు లాంటి కీలక నేతలు అటు వైపు చూడనప్పటికీ.. ఇతర ముఖ్య నేతలను నియోజకవర్గంలో మోహరించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా.. 70 మంది నాయకులకు బాధ్యతలను అప్పగించింది. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసింది. ఉపఎన్నిక నోటిఫికేషన్ సమయానికి రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి.. అన్నదాతల్లో అసంతృప్తి లేకుండా జాగ్రత్తపడింది. ఉపఎన్నిక కోసం ఇంత పెద్ద ఎత్తున సన్నద్ధమైనా.. ఏదో మూలన అనుమానం ఉండటంతో.. సీపీఐతో జతకట్టాలని భావించింది. కానీ ఆర్టీసీ సమ్మె ప్రభావంతో అది కుదరలేదు. 2018 ఎన్నికలోనే ఉత్తమ్‌ను ఓడించడానికి టీఆర్ఎస్ ప్రయత్నించింది. కానీ ట్రక్కు గుర్తు తమను దెబ్బతీసిందని గులాబీ నేతలు చెబుతున్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో ఈ అంశాన్ని పదే పదే జనంలోకి తీసుకెళ్లారు. సైదిరెడ్డి ఓడిపోయి ఏడాది కూడా కాకపోవడంతో ఆయనపై జనంలో సానుభూతి ఉంది. ఉత్తమ్ భార్యను రంగంలోకి దింపితే ఫలితం ఉంటుందని కాంగ్రెస్ భావించినప్పటికీ.. ఆ వ్యూహం ఎదురుతన్నింది. ఈ ఫలితాన్ని రేవంత్ ముందే ఊహించారేమో.. పద్మావతి బదులు మరో అభ్యర్థికి టికెట్ ఇవ్వాలన్నారు. తాము గెలిస్తే నియోజకవర్గం బాగుపడుతుంది.. కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కుటుంబం బాగుపడుతుందని గులాబీ దళం ప్రచారం చేసింది. గత 30 ఏళ్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి జరిగింది. కానీ తాము గెలిస్తే గత 30 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని వచ్చే 4 ఏళ్లలో చేసి చేస్తామని టీఆర్ఎస్ మాటిచ్చింది. దీంతో కాంగ్రెస్‌కు ఓటేస్తే అభివృద్ధికి దూరం అవుతామని ప్రజలు భావించారు. ఈ ఒక్కసారి సైదిరెడ్డి అవకాశం ఇచ్చి చూద్దాం అనుకున్నారు. దీంతో ఏకపక్షంగా టీఆర్ఎస్‌కు విజయాన్ని కట్టబెట్టారు. కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుగా ఉన్న మండలాల్లోనూ టీఆర్ఎస్‌కు భారీగా ఓట్లు పడటానికి ఇదే కారణం. హుజూర్‌నగర్‌లో గులాబీ జెండా ఎగరేయడానికి ఇదే ప్రధాన కారణం. అధికార పార్టీ అయిన టీఆర్ఎస్‌కు ఇతరత్రా అంశాలు కూడా కలిసొచ్చాయి. కేసీఆర్ పథకాల ప్రభావం ఇక్కడ కనిపించింది కానీ.. ఆర్టీసీ సమ్మె ప్రభావం మాత్రం కనిపించలేదు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో సంబంధం లేకుండా.. ఎవరికి ఓటేస్తే తమకు ప్రయోజనం చేకూరుతుందో ప్రజలు వారికే ఓటేశారు.


By October 24, 2019 at 11:39AM


Read More https://telugu.samayam.com/telangana/news/kcr-strategies-development-and-more-reasons-behind-trs-victory-in-huzurnagar-bypoll/articleshow/71735290.cms

No comments