Breaking News

నాటి బద్ధశత్రువు.. నేటి ఆప్తుడు.. వంటేరుకు కీలక పదవి అప్పగించిన కేసీఆర్


మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు లైన్ క్లియర్ చేసిన వేళ.. తెలంగాణ సీఎం నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను ప్రారంభించారు. గజ్వేల్‌లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగి.. కేసీఆర్‌ చేతిలో రెండుసార్లు ఓడి.. 2018 ఎన్నికల ఫలితాల తర్వాత కారెక్కిన వంటేరు ప్రతాపరెడ్డిని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రతాప రెడ్డి ప్రగతి భవన్‌లో సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. కొత్త చైర్మన్‌ విధులు నిర్వహించేందుకు వీలుగా ఆయనకు కార్యాలయం, వాహనాలు, సిబ్బంది, ఇతర సౌకర్యాలు కల్పించాల్సిందిగా పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. 2018 ఎన్నికల వరకు వంటేరు ప్రతాప రెడ్డి.. కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించారు. కేసీఆర్ తన బద్ధ శత్రువని ప్రకటించారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ చేతిలో 19 వేల ఓట్ల తేడాతో ఓడిన వంటేరు.. 2018 ఎన్నికల్లో 56 వేల ఓట్ల తేడాతో ఓడారు. టీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావుతోనూ ఆయనకు వైరం ఉందని చెబుతారు. కానీ ఆపరేషన్ గులాబీతో 2019 జనవరిలో ఆయన కారెక్కారు. దీంతో గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఢీకొట్టే నేత ఎవరూ లేనట్టయ్యింది. అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వంటేరు నియామకంతో.. మంత్రి పదవులు దక్కని, ఎన్నికల్లో ఓడిన టీఆర్ఎస్ నేతల్లో.. తమకు కూడా నామినేటెడ్ పదవులు దక్కుతాయనే ఆశలు చిగురిస్తున్నాయి. మాజీ స్పీకర్ మధుసూదనాచారి, జూపల్లి, నాయిని, కడియం, పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ తదితరులు ఈ రేసులో ఉన్నారు.


By October 24, 2019 at 07:37AM


Read More https://telugu.samayam.com/telangana/news/kcr-appoints-vanteru-pratap-reddy-as-telangana-state-forest-development-corporation-chairman/articleshow/71731530.cms

No comments