Breaking News

అనంత్‌నాగ్‌లో భీకరకాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం


జమ్మూ కశ్మీర్‌లో మరోసారి భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. అనంత్‌నాగ్‌ జిల్లా బిజ్‌బెహరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా బుధవారం తెల్లవారుజామున అక్కడకు చేరుకుని నిర్బంధ తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో భద్రతా బలగాలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన సైన్యం వెంటనే ఎదురుకాల్పులు ప్రారంభించింది. ఇదే సమయంలో ఉగ్రవాదులు ఓ ఇంట్లోకి చొరబడగా... దానిని చుట్టిముట్టిన సైన్యం ముగ్గురు ముష్కరుల్ని హతమార్చింది. భీకర కాల్పులు కొనసాగిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. మొబైల్ సేవలపై ఇప్పటికే ఆంక్షలు కొనసాగుతుండటంతో వదంతులు వ్యాపించకుండా ఇంటర్నెట్ కూడా నిలిపివేశారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ సైనికుడు సైతం గాయపడినట్టు సమాచారం. అలాగే, పజాల్‌పొర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రతా దళాలు స్థానికులను హెచ్చరించాయి. ఈ ప్రాంతంలోనూ సైన్యం తనిఖీలు చేపట్టింది. మరోవైపు, గాందర్బల్‌ అడవుల్లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదుల్ని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారం రోజులుగా వీరి కోసం గాలిస్తుండగా, మంగళవారం ఎట్టకేలకు చిక్కారు. కాగా, కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్‌ మరోసారి ఉల్లంఘించి ఉరి సెక్టారులో ఓ సైనికుడు, షాపుర్‌ సెక్టార్‌లో షమీమా అక్తర్‌(24) అనే మహిళను పొట్టనబెట్టుకుంది. ఉగ్రవాదుల చొరబాట్లను నిరోధించేందుకు నౌగామ్‌ సెక్టార్‌లో పహారా కాస్తుండగా మందుపాతర పేలి ఓ జవాను ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, సోమవారం పోస్ట్-పెయిడ్ మొబైల్ సేవలను పునరుద్ధరించగా, మంగళవారం జరిగిన సంఘటనలతో మళ్లీ నిలిపివేశారు. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా మహిళా సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి.


By October 16, 2019 at 12:08PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/three-terrorists-were-shot-dead-by-security-forces-in-anantnag-in-kashmir/articleshow/71610096.cms

No comments