Breaking News

రూ.5000 కోట్ల విలువైన భూములు.. తెలంగాణ సర్కారుకే..సుప్రీం తీర్పు!


పుప్పాలగూడలోని కాందిశీకుల భూముల కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో హైదరాబాద్ శివారులోని దాదాపు 200 ఎకరాల భూమి ప్రభుత్వపరం కానుంది. ఈ భూముల కోసం దాఖలైన ప్రైవేట్ వ్యక్తుల పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఇవి రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతాయంటూ 2016లో వెలువరించి హైకోర్టు తీర్పును సమర్థించింది. హైటెక్ సిటీ సమీపంలో ఉండే ఈ భూముల విలువ కనీసం రూ.2 వేల కోట్లు పలుకుతుందని భావిస్తున్నారు. ఈ భూములను అభివృద్ధి చేసి వేలం వేస్తే.. రూ.5 వేల కోట్లు పలికినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. పుప్పాలగూడలో మొత్తం 958 ఎకరాల్లో కాందిశీకుల భూములు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించే ముంబైలోని కస్టోడియన్ బోర్డు.. దాదాపు 200 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు ధారదత్తం చేసింది. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. 2016 ఫిబ్రవరిలో ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. రమేశ్ మలానీ అనే వ్యక్తి సుప్రీం కోర్టుకు వెళ్లారు. దేశ విభజన సమయంలో ఇక్కడి వారు కొందరు తమ భూములను వదులుకొని పాకిస్థాన్‌లో స్థిరపడ్డారు. పాకిస్థాన్‌కు చెందిన కొందరు ఇండియాకు వచ్చి స్థిరపడ్డారు. ఇక్కడి నుంచి వలస వెళ్లిన వారి భూములను కాందిశీకుల భూములు అంటారు. వీటిని పాక్ నుంచి వలస వచ్చిన వారికి కేటాయించారు. అలాగే పరశరామ్ రామ్‌చంద్ మలానీ పాకిస్థాన్‌లోని సింధ్‌లో ఉన్న తన ఆస్తులను వదులుకొని వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. దీంతో ఆయనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 323 హైదరాబాద్‌లోని బాట సింగారం, బోయినపల్లి ప్రాంతాల్లో 1956లో 323 ఎకరాలను కేటాయించాయి. ఆయన 1988లో చనిపోగా.. వేరే భూమి తనదని ఎక్కడా పేర్కొనలేదు. కానీ ఆయనకు 200 ఎకరాల భూమి దక్కుతుందని రమేశ్ పరశరామ్ మలానీ వాదించారు. 2003-06 మధ్య అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్కారు రమేశ్‌కు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. కానీ 2016లో హైదరాబాద్ హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఇందులో వేరే వ్యక్తుల జోక్యం ఉందని పేర్కొంది. అసలు పిటీషన్ దాఖలు చేసిన వ్యక్తి చనిపోయిన పరశరామ్‌కు అసలైన వారసుడేనా? అనే అనుమానాలను సైతం కోర్టు వ్యక్తం చేసింది.


By October 23, 2019 at 08:15AM


Read More https://telugu.samayam.com/telangana/news/puppalaguda-land-case-telangana-govt-owner-of-200-acres-says-supreme-court/articleshow/71714532.cms

No comments